అధికార పార్టీకి భయపడి పోలీసులు కేసు పెట్టారు: పేర్ని నాని
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:56 AM
ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసు విచారణకు ఆయన సోమవారం హాజరయ్యారు.
సత్తెనపల్లి పీఎ్సలో విచారణకు హాజరు
సత్తెనపల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసు విచారణకు ఆయన సోమవారం హాజరయ్యారు. పేర్ని నానికి పట్టణ పోలీసులు 41 నోటీసు ఇచ్చి పంపించి వేశారు. ఈ సందర్భంగా ఆయన పీఎస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘అధికార పార్టీ నేతలకు భయపడి పోలీసు ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు మాపై కేసులు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్తో కలసి పర్యటనకు రావటం వల్ల నాపై కేసు నమోదయింది. సత్తెనపల్లి పోలీసులు ఆదివారం మచిలీపట్నంలో మా ఇంటికి వచ్చి నోటీసు ఇచ్చి వెళ్లారు. 11 సెక్షన్ల కింద నేరం నమోదు చేశారు’ అని పేర్ని తెలిపారు.