Payyavula Keshav: ఒక్క ఓటుతో..అగ్ర స్థానంలో ఆంధ్ర
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:18 AM
ఒక్క చాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే.. 2024లో ఎన్డీఏకి ప్రజలు వేసిన ఆ ఒక్క ఓటే రాష్ట్ర భవిష్యత్ను మార్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఆ ఓటు రాష్ట్ర భవిష్యత్ను మార్చేసింది
లక్షల కోట్ల అభివృద్ధి, వేల కోట్ల సంక్షేమం తెచ్చింది
పోలవరం, రాజఽధాని, విశాఖ ఉక్కు, రైల్వేజోన్, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు నిధుల వరద: పయ్యావుల
కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఒక్క చాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే.. 2024లో ఎన్డీఏకి ప్రజలు వేసిన ఆ ఒక్క ఓటే రాష్ట్ర భవిష్యత్ను మార్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఒక్క ఓటుతో ఆంధ్రను అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. కర్నూలు సభలో ఆయన మాట్లాడారు. ‘మీరు వేసిన ఒక్క ఓటే రూ.లక్షల కోట్ల అభివృద్ధి, రూ.వేల కోట్ల సంక్షేమం తీసుకొచ్చింది. ఒక్క ఓటు పోలవరానికి రూ.12,500 కోట్లు, అమరావతికి రూ.15 వేల కోట్లు, విశాఖ ఉక్కుకు రూ.11,400 కోట్లు, విశాఖకు రైల్వే జోన్, జాతీయ రహదారులకు రూ.70 వేల కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్, రూ.లక్ష కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, రూ.లక్ష కోట్ల ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వచ్చాయి. మెగా డీఎస్సీ-2024 నిర్వహించి 16 వేల మందిని టీచర్లను చేసింది.. 65 లక్షల మంది అమ్మలకు తల్లికి వందనం కింద రూ.15 వేలు, రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, అమ్మకు వందనం, స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు రూ.15 వేల సాయం.. ఇవన్నీ మీరు వేసిన ఒక్క ఓటుతోనే సాధ్యమయ్యాయి’ అని ప్రజలనుద్దేశించి అన్నారు. సూపర్ జీఎస్టీతో నిత్యావసర సరుకులు, వస్తు, సేవల ధరలు తగ్గింపు, ప్రతి కుటుంబానికి రూ.20 వేలకు పైగా ఆదా అవుతోందని చెప్పారు. ‘దీనిని ఇంటింటికీ తీసుకెళ్లడానికి సీఎం ఆదేశాలతో మంత్రి లోకేశ్ నేతృత్వంతో ఒక టీం పని చేసింది. 98 వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించాం’ అని వివరించారు. మోదీ ఆశీస్సులు, చంద్రబాబు, లోకేశ్ ఆలోచనతో.. రాష్ట్ర భవిష్యత్ను మార్చేలా గూగుల్ సంస్థ విశాఖకు రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చిందని తెలిపారు. ‘మన పిల్లల భవిష్యత్ కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్’ అని స్పష్టంచేశారు.