అడ్డంకులు!
ABN , Publish Date - May 22 , 2025 | 12:42 AM
జిల్లాలో కొత్త బియ్యం కార్డుల జారీ, చేర్పులు, మార్పుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డుల కోసం ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో కార్డు వివరాల నమోదుకు అధిక సమయం పడుతోంది. దీంతో రోజుకు 20 కార్డుల వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఫలితంగా కొత్తగా బియ్యం కార్డులు కావాల్సిన వారు, చేర్పులు, మార్పులు చేయించుకోవాల్సిన వారు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకే సమయం ఉండటంతో కార్డుల కోసం తిరిగే వారు ఆందోళన చెందుతున్నారు.
- నత్తనడకన బియ్యం కార్డుల జారీ
- సచివాలయాల్లో పనిచేయని సర్వర్లు
- ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 13,500
- వీటిలో అధికశాతం పెండింగ్లోనే..
- పక్కనపడేస్తున్న వితంతువుల దరఖాస్తులు
- మరో వారం రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనా!
జిల్లాలో కొత్త బియ్యం కార్డుల జారీ, చేర్పులు, మార్పుల ప్రక్రియ ప్రహసనంగా మారింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త కార్డుల కోసం ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో కార్డు వివరాల నమోదుకు అధిక సమయం పడుతోంది. దీంతో రోజుకు 20 కార్డుల వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఫలితంగా కొత్తగా బియ్యం కార్డులు కావాల్సిన వారు, చేర్పులు, మార్పులు చేయించుకోవాల్సిన వారు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకే సమయం ఉండటంతో కార్డుల కోసం తిరిగే వారు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలో 5,22,589 బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డులో చేరికలు, తొలగింపులు, అడ్రస్ మార్పు, కొత్తకార్డుల జారీ కోసం ఈ నెల 7వ తేదీ నుంచి సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. బుధవారం నాటికి 13,500లకుపైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్ల్లాలో 508 సచివాలయాలు ఉండగా, వాటిలో ఉన్న కంప్యూటర్లు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో కొత్త బియ్యం కార్డులకు సంబంధించిన వివరాలు నమోదు చేయడానికి ఆలస్యమవుతోంది. కొన్ని సచివాలయాల్లోని ల్యాప్టాప్ల్లో ఈ వివరాలు నమోదు చేస్తున్నారు. వీఎస్డబ్ల్యూఎస్ సర్వర్లో ఈ వివరాలు నమోదు చేయడానికి ప్రయత్నిస్తే సర్వర్ సేవలు అందుబాటులో లేక తీవ్ర ఆలస్యమవుతోంది. కుటుంబం పెద్ద మరణిస్తే ఆయన భార్య ఒక్కరికే బియ్యంకార్డు ఇచ్చేందుకు ఆన్లైన్లో నమోదు చేసేందుకు అవకాశం లేకపోవడంతో ఈ తరహాలో వచ్చిన దరఖాస్తులను సచివాలయ సిబ్బంది పక్కనపెట్టేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేవరకు తామేమీ చేయలేమంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల ద్వారా చేయించిన హౌస్హోల్డ్ మ్యాపింగ్ను ఆధారంగా చేసుకుని కొత్త బియ్యం కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను చేస్తుండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో వివాహం చేసుకుని వేరే గ్రామానికి వచ్చిన మహిళల ఆధార్ కార్డు నెంబర్లు పుట్టిన గ్రామంలో నమోదై ఉండటంతో శుభలేఖ, వివాహ రిజిస్ర్టేషన్ పత్రాలు తీసుకురావాలని ఆంక్షలు పెట్టారు. ఈ అంశంపై ప్రజల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో భార్యభర్తలు ఇద్దరూ వచ్చి ఈకేవైసీ చేయించుకుంటే కొత్తకార్డు ఇచ్చేలా వెసులుబాటు కల్పించారు.
సర్వర్ సామర్థ్యం పెంచేలా చర్యలు : డీఎస్వో పార్వతి
కొత్త బియ్యం కార్డుల జారీ, చేర్పులు, మార్పుల కోసం జిల్లాలో ఇప్పటి వరకు 13,500లకుపైగా దరఖాస్తులు వచ్చాయని డీఎస్వో (జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి) పార్వతి తెలిపారు. సర్వర్ సమస్య కారణంగా వీటి వివరాలు నమోదు చేయడంలో ఆలస్యం అవుతోందన్నారు. కొత్తకార్డుల జారీ, చేర్పులు, మార్పుల సమయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరించామని తెలిపారు. పౌరసఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసఫరాలశాఖ కమిషనర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పారు. గురువారం నుంచి సర్వర్ సామర్థ్యం పెంచడంతోపాటు కార్డుల జారీలో నెలకొన్న సమస్యలన్నింటీని సరిచేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని వివరించారు. కాగా, జేసీ గీతాంజలిశర్మ జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త బియ్యం కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.