AP High Court: వారిని లోకల్గానే పరిగణించండి
ABN , Publish Date - Jul 29 , 2025 | 06:38 AM
వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్లో తమను లోకల్ అభ్యర్థులుగా పరిగణించి, దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు...
ఆ విద్యార్థుల దరఖాస్తులు స్వీకరించండి
ఎన్టీఆర్ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
తెలంగాణలో ఇంటర్ చదివినవారికి ఊరట
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్లో తమను లోకల్ అభ్యర్థులుగా పరిగణించి, దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ జరిపింది. పిటిషనర్లను లోకల్ అభ్యర్థులుగా పరిగణించి, వారి దరఖాస్తులు స్వీకరించాలని ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ను ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సవివరంగా కౌంటర్ దాఖలు చేయాలని యూనివర్సిటీకి స్పష్టం చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నీట్లో అర్హత సాధించినా, ఇంటర్ తెలంగాణలో చదివామనే కారణంతో వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్లో తమను లోకల్ అభ్యర్థులుగా పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన ఎస్కే ఖమరుద్ధీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన సనపల వెంకటరమణ మరో 51మంది వేరొక పిటిషన్ వేశారు.