Nadamuri Mohan Krishna: ఎన్టీఆర్ ప్రజల మనిషి
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:49 AM
పెత్తందారుల వ్యవస్థ, రాచరికం ఏలుతున్న కాలంలో బడుగు, బలహీన వర్గాలు, పేదల కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన తనయుడు నందమూరి మోహన కృష్ణ అన్నారు.
ఆయన జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసమే: నందమూరి మోహన కృష్ణ
రాతనలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
తుగ్గలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పెత్తందారుల వ్యవస్థ, రాచరికం ఏలుతున్న కాలంలో బడుగు, బలహీన వర్గాలు, పేదల కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన తనయుడు నందమూరి మోహన కృష్ణ అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పాలన సాగించిన ఎన్టీఆర్ ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. తుగ్గలి మండలం రాతన గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహనకృష్ణ, ఆయన కుమార్తె మోహన రూప హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకులు వైవీఎస్ చౌదరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహనకృష్ణ గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982కు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ఆ సమయంలో పేదల కష్టాలను చూసి తమ తండ్రి నందమూరి తారక రామారావు తనకు ఎంతో ఇష్టమైన కళను కూడా పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. రూ.2కే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల స్థలాలు, మహిళలకు మహిళా చట్టాలు, హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని స్పష్టంచేశారు. శ్యాంబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్, కేఈ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.