ఇక ప్రైవేటుగా.. డ్రైవింగ్ లైసెన్సుల జారీ!
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:26 AM
రాష్ట్రంలోనే మొదటి సారిగా కృష్ణాజిల్లా అంపాపురంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహించే ‘మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ప్రైవేటు కేటగిరీలో లైసెన్సుల జారీ చేసే కేంద్రంగా ఎంపికైంది. దేశ వ్యాప్తంగా ప్రైవేటుగా కూడా లైసెన్సుల జారీకి అనుమతులు ఇవ్వటంతో మన దగ్గర నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో)గా గత పాతికేళ్లుగా ఎందరినో నాణ్యమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్న కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్కు (కేడీఎల్వోఏ)కు ఈ అరుదైన అవకాశం దక్కింది.
-కేడీఎల్వోఏ అంపాపురం డ్రైవింగ్ కళాశాలకు అరుదైన గుర్తింపు
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో దక్కిన స్థానం
-ప్రస్తుతం ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవర్లకు శిక్షణ అందిస్తున్న సంస్థ
-శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇక నేరుగా డ్రైవింగ్ లైసెన్సు జారీ అధికారం
-కార్లు, ద్విచక్రవాహనాలకు కూడా ఇక్కడే లైసెన్సులు జారీ.. శిక్షణ తప్పనిసరి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రాష్ట్రంలోనే మొదటి సారిగా కృష్ణాజిల్లా అంపాపురంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహించే ‘మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్’ ప్రైవేటు కేటగిరీలో లైసెన్సుల జారీ చేసే కేంద్రంగా ఎంపికైంది. దేశ వ్యాప్తంగా ప్రైవేటుగా కూడా లైసెన్సుల జారీకి అనుమతులు ఇవ్వటంతో మన దగ్గర నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో)గా గత పాతికేళ్లుగా ఎందరినో నాణ్యమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్న కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్కు (కేడీఎల్వోఏ)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. అంపాపురంలోని మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో హెవీ వెహికల్ డ్రైవర్లకు మాత్రమే శిక్షణ ఇవ్వటం జరుగుతోంది. తాజా నిబంఽధనల ప్రకారం రెండున్నర నెలలు ఈ కేంద్రంలో శిక్షణ తీసుకున్న వారికి నేరుగా హెవీ వె హికల్ లైసెన్సులు జారీ చేస్తారు. ఆ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా రవాణా శాఖ హెవీ వెహికల్ లైసెన్స్ను జారీ చేస్తుంది. ఇక్కడ ద్విచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ నేర్చుకున్న వారికి కూడా రవాణా శాఖలో ఎలాంటి టెస్ట్లు నిర్వహించకుండా రవాణా శాఖ నేరుగా హెవీ వెహికల్ లైసెన్స్ను మంజూరు చేస్తుంది.
శిక్షణ తప్పనిసరి
ప్రైవేటు సంస్థల ద్వారా హెవీ వెహికల్ లైసెన్స్లు పొందాలంటే రెండున్నర నెలలు అంటే 10 వారాల పాటు నిరంతరాయ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అంపాపురంలోని మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో హెవీ వెహికల్ డ్రైవర్లకు ప్రస్తుతం నెల రోజుల శిక్షణ తర్వాత సర్టిఫికెట్లను ఇస్తున్నారు. ఇక మీదట ఇక్కడ కూడా 10 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఏదో రెండు, మూడు రోజుల పాటు వచ్చి సర్టిఫికెట్లు తీసుకుంటామంటే కుదరదు. పదహారు గంటల థియరీ క్లాసులు వినటంతో పాటు 22 గంటల ప్రాక్టికల్స్ ఉండాలి. ప్రతి రోజూ ఏ వాహనం మీద డ్రైవర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు? ఇన్స్ట్రక్టర్ ఎవరు ? ఎన్ని గంటల పాటు డ్రైవింగ్ చేశాడు? వంటివి ఆన్లైన్లో రికార్డు అవుతుంటాయి. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత స్థానికంగా నిర్వాహకులు టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. హెవీ వెహికల్ లైసెన్స్లు కలిగిన వారితో పాటు లైట్ మోటారు వెహికల్, ద్విచక్రవాహనాల డ్రైవింగ్ లైసెన్సుల జారీకి కూడా శిక్షణ ఇస్తారు.
అమల్లోకి వచ్చిన విధానం
ప్రైవేటు సంస్థ ద్వారా లైసెన్సుల జారీ విధానం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇప్పటికే అమల్లోకి వచ్చింది. అంపాపురంలోని మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చి సెంటర్లో హెవీ హెహికల్ డ్రైవర్లకు సంబంధించిన మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభమైంది. వీరంతా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లను సాధిస్తే.. రవాణా శాఖ నుంచి పర్మినెంట్ హెవీ వెహికల్ లైసెన్సులు జారీ అవుతాయి.
డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఎలా ఏర్పడిందంటే..
1988లో డ్రైవర్లకు తగిన శిక్షణ అవసరమని భావించి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని చేయటం జరిగింది. అందులో భాగంగా విజయవాడలో రోడ్ల మీద వాహనాలను నడిపిస్తూ శిక్షణ ఇచ్చేవారు. ఈ విధానం వల్ల నైపుణ్యవంతమైన డ్రైవర్లు కావటం లేదని అప్పట్లో కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భావించింది. నాణ్యమైన డ్రైవర్లను తీర్చిదిద్దటానికి తామే డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో అప్పట్లో అసోసియేషన్లో క్రియాశీలకంగా ఉన్న వైవీ ఈశ్వరరావు నేతృత్వంలో రవాణా శాఖను సంప్రదించి 1991లో గూడవల్లిలో 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు ప్రోత్సాహకాలు కల్పించటంతో 1993లో అంపాపురం దగ్గర 19 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్జి సెంటర్ను నెలకొల్పారు. ఏటా వందలాది మంది శిక్షణ పొందుతూ రవాణా శాఖ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రధానం జరుగుతుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేటుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ అండ్ రీసెర్చి సెంటర్స్ (ఐడీటీఆర్సీ)లకు అనుమతి ఇవ్వటంతో తనను తాను అప్గ్రేడ్ చేసుకోవటానికి వీలుగా, అత్యాధునిక సిమ్యులేటర్లు, ఇతర సాంకతిక వ్యవస్థలను బలోపేతం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి కృష్ణాజిల్లా లారీ యజమానుల సంఘం దరఖాస్తు చేసింది. ఆమేరకు అంపాపురం శిక్షణా కేంద్రానికి ప్రైవేటుగా లైసెన్సుల జారీ చేసే అధికారం దక్కింది.
ప్రైవేటు సంస్థలకూ అవకాశం:
డ్రైవింగ్ శిక్షణ కల్పించాలనుకున్న ఇతర ప్రైవేటు సంస్థలకు కూడా కేంద్రం అనుమతులు ఇస్తుంది. ప్రస్తుతం అంపాపురంలో కేడీఎల్వోఏ నిర్వహిస్తున్న ఐటీడీఆర్సీ అయితే కనీసం 20 ఎకరాల విస్తీర్ణంతో పాటు ట్రాక్, అత్యాధునిక సిమ్యులేటర్లు, ఇన్స్ట్రక్టర్స్ కలిగి ఉండాలి. వీటికి కేంద్రం రూ.4 కోట్లు ఇస్తుంది. మరో రూ.2 కోట్లను కేడీఎల్వోఏ భరించింది. ఇవి కాకుండా రీజనల్ డ్రైవింగ్, ట్రైనింగ్ సెంటర్స్ (ఆర్డీటీసీ)లను ఇస్తారు. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ.3.50 కోట్లు అందిస్తుంది. ఇవి కాకుండా డ్రైవింగ్, ట్రైనింగ్ సెంటర్స్ (డీటీసీ)లకు కూడా అనుమతినిస్తోంది. వీటికి రూ.2.50 కోట్ల నిధులను కేంద్రం అందిస్తుంది. కేవలం రెండు ఎకరాలు ఉంటే సరిపోతుంది.