High Court: అరెస్టు నుంచి మోహిత్రెడ్డికి రక్షణ వద్దు
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:01 AM
మద్యం కుంభకోణం ద్వారా ముడుపుల రూపంలో వచ్చిన రూ.8 కోట్ల సొమ్మును తరలించేందుకు మోహిత్రెడ్డి తుడా వాహనాలు వినియోగించారని సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మంగళవారం హైకోర్టుకు నివేదించారు.
రెండుసార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదు
హైకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం ద్వారా ముడుపుల రూపంలో వచ్చిన రూ.8 కోట్ల సొమ్మును తరలించేందుకు మోహిత్రెడ్డి తుడా వాహనాలు వినియోగించారని సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మంగళవారం హైకోర్టుకు నివేదించారు. విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని రెండుసార్లు నోటీసులు ఇచ్చినా మోహిత్రెడ్డి స్పందించలేదన్నారు. దీంతో ఆయన పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని తెలిపారు. అరెస్ట్ నుండి పిటిషనర్కు రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది దుష్యంత్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి’’ అని కోరారు. కేసులో పిటిషనర్ను నిందితుడిగా (ఏ39) చేర్చారని, కానీ సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఈనెల 11కు వాయిదా వేశారు.