Bail Rejected: మిథున్రెడ్డికి సుప్రీం ఝలక్
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:25 AM
మద్యం కుంభకోణం కేసులో ముఖ్య నిందితుడు,వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి(ఏ-4)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
హైకోర్టు తీర్పులో జోక్యానికి నిరాకరణ
లొంగిపోవడానికి వారం గడువిచ్చేందుకూ కోర్టు విముఖత
ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం
మద్యం కేసులో మిథున్రెడ్డిది కీలక పాత్ర
ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయి
రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ముఖ్య నిందితుడు,వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి(ఏ-4)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకూ విముఖత చూపింది.ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించడంతో..న్యాయస్థానం తీర్పును ఆయన ఈ నెల 16న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మిథున్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.మిథున్రెడ్డి బాధ్యత కలిగిన వ్యక్తి అని.. లోక్సభ సభ్యుడని సింఘ్వీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారా అని జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించారు. అరెస్టు చేయలేదని, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశామని సింఘ్వీ బదులిచ్చారు.ఈ కేసులో మిథున్రెడ్డిని అరెస్టు చేయడానికి ఎటువంటి బలమైన కారణాలు లేవన్నారు.మరోసారి జస్టిస్ పార్దీవాలా కలుగజేసుకుని.. ముందస్తు బెయిల్ కోసం మీ వద్ద ఇంకేమైనా బలమైన వాదనలు ఉన్నాయా అని అడిగారు.ఈ సమయంలో రోహత్గీ స్పందిస్తూ.. ఈ కేసులో మిథున్రెడ్డిది కీలక పాత్రని,ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఆయన వాదనలను కింది కోర్డులు కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
ఈ కేసులో మిథున్రెడ్డికి ముందున్న మరో ముగ్గురు కీలక నిందితులకు సైతం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానాలు నిరాకరించాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనల అనంతరం..హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి తమకెలాంటి కారణమూ కనిపించడం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. దరిమిలా పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అరెస్టు చేయాలని చూస్తున్నారని, అందుచేత మిథున్రెడ్డి లొంగిపోవడానికి వారం రోజులైనా సమయం ఇవ్వాలని సింఘ్వీ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం నిరాకరించింది.
మిథున్రెడ్డిపై సిట్ వారెంటు వెనక్కి
మద్యం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ రాజంపేట ఎంపీ పి.మిథున్రెడ్డి(ఏ-4)ని అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన వారెంటును ఏసీబీ కోర్టు తిప్పిపంపింది. కేసుకు సంబంధించిన మరికొన్ని డాక్యుమెంట్లను దానికి జత చేయాలని న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదేశించారు.