CM Chandrababu: అర్హులైన వారి పింఛన్ రద్దు కాదు
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:17 AM
పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
దివ్యాంగులెవరూ ఆందోళన చెందవద్దు
పింఛన్లపై సమీక్షలో చంద్రబాబు భరోసా
గత ప్రభుత్వంలో అడ్డదారిలో సర్టిఫికెట్లు
వాటితో అనర్హులకు పింఛన్లు
ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పింఛన్ల విషయంలో అర్హులైన దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెద్దఎత్తున దివ్యాంగ పింఛన్లు తొలగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గురువారం సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని పింఛన్లు పొందుతున్న వారిపై ఇటీవల జరిపిన పునఃపరిశీలన వివరాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ ప్రక్రియలో అనర్హులను గుర్తించినట్లు చెప్పారు. అన్ని విధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి.. ఎలాంటి వైకల్యం లేకుండానే కొంత మంది దివ్యాంగ పింఛన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. అనర్హులను ధ్రువీకరించడానికి ప్రత్యేక వైద్య బృందాలను నియమించి, పింఛన్ అనర్హులను నిర్ధారించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. నకిలీ పింఛన్లు మాత్రమే తొలగించాలని, అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ వ్యక్తికి పింఛన్ రద్దు కాకూడదని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న పింఛన్లన్నీ యథావిధిగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అలాగే తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పింఛన్, హెల్త్ పెన్షన్ పొందేవారికి కూడా ఎప్పటిలా నెలనెలా పింఛన్ అందించాలని స్పష్టం చేశారు. వారికి పంపించిన నోటీసులు సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు.