Minister Mansukh Mandaviya: ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:11 AM
గడచిన మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘క్రీడల మానవ వనరుల అభివృద్ధి’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎవరికీ ఫెలోషిప్, సదస్సు, పరిశోధన నిధులు ఇవ్వలేదని...
సరైన ప్రతిపాదనలు అందలేదు: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గడచిన మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘క్రీడల మానవ వనరుల అభివృద్ధి’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎవరికీ ఫెలోషిప్, సదస్సు, పరిశోధన నిధులు ఇవ్వలేదని కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవియా వెల్లడించారు. సోమవారం లోక్సభలో ఎంపీ కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ పథకం ద్వారా క్రీడాకారులు, కోచ్లు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు, పరిశోధకుల నైపుణ్యాలు, జ్ఞానం పెంచడానికి ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా కేవలం ఇద్దరే ఫెలోషిప్ పొందగా, వారిలో ఎవరూ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు లేరని స్పష్టం చేశారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 2 ఫెలోషిప్పులు, 47 సదస్సులు, 12 పరిశోధన ప్రాజెక్టులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఏపీ నుంచి సరైన ప్రతిపాదనలు అందకపోవడాన్నిబట్టి ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు లేనట్లు స్పష్టమవుతోందన్నారు.