Fishing Guidelines: చేపల వేటపై కేంద్రం తాజా మార్గదర్శకాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 06:16 AM
రాష్ట్ర తీర ప్రాంత సముద్ర జలాల(22 కిలో మీటర్ల) సరిహద్దు అవతల 370 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న భారత జలాల పరిధిలో...
అమరావతి, నవంబరు6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తీర ప్రాంత సముద్ర జలాల(22 కిలో మీటర్ల) సరిహద్దు అవతల 370 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న భారత జలాల పరిధిలో 320 కిలోమీటర్ల వరకు మత్స్యకార కార్యకలాపాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసిందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. దీని వల్ల మత్స్యకారులకు, మత్స్యకార సంఘాలకు కలిగే లాభాలను ఆయన ఓ ప్రకటనలో వివరించారు. ‘కేంద్రప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక మండలిలో చేపల వేటకు సంబంధించి ఏవైనా రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తారు. మత్స్యకారులకు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. రికార్డులో నమోదు కాని వేటను నియంత్రించవచ్చు. జీవవైవిధ్య పరిరక్షణకు అవకాశం ఉంటుంది. ప్రాంతీయ మత్స్య నిర్వహణ సంస్థలు, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా చేపల వేట కార్యకలాపాలు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలుంటాయి’ అని ఆయన వివరించారు.