ఎత్తిపోతలపై జగన్ నిర్లక్ష్యం: నిమ్మల
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:11 AM
రాష్ట్రంలో 1008 ఎత్తిపోతల ప్రాజెక్టులుంటే గత ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
అమరావతి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1008 ఎత్తిపోతల ప్రాజెక్టులుంటే గత ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇప్పుడు వీటి మరమ్మతులకు దాదాపు రూ.725 కోట్ల మేర అవసరమవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ పనులకు టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలైందన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చేపట్టిన నీటి నిర్వహణ సత్ఫలితాలిచ్చిందన్నారు. ఎగువ నుంచి వచ్చిన వరదను ఒడిసి పట్టామని.. చంద్రబాబు దూరదృష్టి.. ముందడుగు వల్లే రాష్ట్రంలో జలాశయలన్నీ నిండాయని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉన్నా.. ఎగువనుంచి వచ్చిన వరదను రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించామని.. కృష్ణా జలాలను హంద్రీ-నీవా నుంచి కుప్పం దాకా తీసుకెళ్లామని వెల్లడించారు.