Women Commission: మహిళలను కించపరిచే వ్యాఖ్యలు నేరం
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:05 AM
మహిళల హుందాతనానికి భంగం కలిగించేలా వ్యాఖ్యానించడం పెద్ద నేరమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజుందార్ తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా..
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన స్పష్టీకరణ
విజయవాడ, మంగళగిరి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మహిళల హుందాతనానికి భంగం కలిగించేలా వ్యాఖ్యానించడం పెద్ద నేరమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మజుందార్ తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలను కించపరిచేలా టీవీ చర్చా కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, సభ్యురాలు బూసి వినీత ఆమెకు స్వాగతం పలికారు. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలను ఆమె సందర్శించారు. పది మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్న ప్రతి సంస్థలోను అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కళాశాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశారా? అని ఆమె ప్రశ్నించగా, వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని కళాశాల అధికారులు తెలిపారు. మహిళల రక్షణ కోసం మహిళా కమిషన్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, ఏ సమయంలో అయినా బాధితులు కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని అర్చన తెలిపారు. బాలికలు, మహిళలపై దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిని ఆమె పరిశీలించారు. స్వధార్ హోంలో పునరావాసం పొందుతున్న మహిళలతో మాట్లాడారు. వివిధ అంశాలపై ఫిర్యాదులకు సంబంధించి మహిళా జన్ సున్వాయ్లో భాగంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో మూడు రోజులు పర్యటించనున్నట్లు తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ కార్యదర్శి అనురాధ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఈడీ ప్రవీణ్, ఏడీ కుమారి, లీగల్ కౌన్సిలర్లు, సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.