Environmental Protection: వైసీపీ చెర నుంచి బి.తాండ్రపాడు చెరువుకు విముక్తి
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:22 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన కర్నూలు నగర శివారులోని బి.తాండ్రపాడు (గంగమ్మ) చెరువులో ఆక్రమణలను తొలగించాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.
ఆక్రమణలు తొలగించాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు
కర్నూలు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన కర్నూలు నగర శివారులోని బి.తాండ్రపాడు (గంగమ్మ) చెరువులో ఆక్రమణలను తొలగించాలని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. కర్నూలు-చిత్తూరు ప్రధాన రహదారి పక్కనే బి.తాండ్రపాడు గ్రామంలో 53.86 ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ చెరువు ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు చెరువులో దాదాపు 12 ఎకరాలు ఆక్రమించారు. దీనిపై టీడీపీ యువనాయకుడు, మాజీ ఎంపీపీ డి.రాజవర్ధన్రెడ్డి 2021లో చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ సమయంలో ఆయన మరణించడంతో ఆయన తండ్రి కేడీసీసీ చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి కేసు కొనసాగించారు. సుదీర్ఘ పోరాటం ఫలించి గంగమ్మ చెరువులో అక్రమణలను తొలగించాలని శుక్రవారం ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిందని విష్ణువర్ధన్రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కాగా.. వైసీపీ హయాంలో ఆక్రమణకు గురైన గంగమ్మ చెరువును ప్రతిపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. వైసీపీ అండతో సాగించిన ఆక్రమణలపై ఆనాడు గళమెత్తారు.