Nara Lokesh: కోరినవన్నీ ఇస్తున్నారు
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:10 AM
ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడి ప్రజలన్నా ప్రధాని మోదీకి అపారమైన ప్రేమ. 16 నెలల్లో నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారు. మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నారు అని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ కొనియాడారు.
ఆంధ్రాపై మోదీకి అపార ప్రేమ
16 నెలల్లో నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారు
స్థిరమైన అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం ముఖ్యం
ఏపీ నంబర్ వన్ కావాలంటే.. ప్రభుత్వం కొనసాగడం అవసరం
గుజరాత్ ఇలాగే అభివృద్ధి చెందింది
మోదీ 3 దఫాలుగా ప్రధానిగా ఉన్నారు కనుకే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
మాది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు
మంత్రి లోకేశ్ ఉద్ఘాటన
కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్ అన్నా, ఇక్కడి ప్రజలన్నా ప్రధాని మోదీకి అపారమైన ప్రేమ. 16 నెలల్లో నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారు. మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నారు’ అని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ కొనియాడారు. రాష్ట్రంలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అని పునరుద్ఘాటించారు. కర్నూలు సూపర్ జీఎ్సటీ - సూపర్ సేవింగ్స్ సభలో గురువారం ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ వన్ కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరమన్నారు. స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే సుస్థిర ప్రభుత్వం కొనసాగడం ముఖ్యమని తెలిపారు. దానివల్లే గుజరాత్ అభివృద్ధి చెందిందన్నారు. మోదీజీ వరుసగా 3సార్లు ప్రధాని కావడం వల్లే ప్రపంచంలో 10 నుంచి 4వ అతి పెద్ద ఎకానమీగా భారత్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సభలో ఏమన్నారో ఆయన మాటల్లోనే..
దసరా, దీపావళి ఒకేసారి
సంక్షేమం- అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండిలాంటివి. కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నంబర్ వన్ కావడం గ్యారెంటీ. పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ పేస్లేస్ పవర్ఫుల్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్లను గడగడ లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డివంటివారు జన్మించిన గొప్ప నేల ఈ జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు. జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం వస్తుందని చెప్పినా.. నష్టం వచ్చినా పర్వాలేదు దేశానికి లాభం జరుగుతుందని ప్రధాని చెప్పారంటే ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమ తెలుస్తుంది. ప్రతి వస్తువుపైనా జీఎస్టీ తగ్గించడంతో ప్రజలు పండగ చేసుకుంటున్నారు. పేద ప్రజల చిరునవ్వే మన ప్రధానికి పండుగ. పేదరికం లేని దేశమే మన ‘నమో’ కల. జీఎస్టీ తగ్గించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వచ్చి దాదాపు రూ.8 వేల కోట్లు నష్టపోతామని చంద్రబాబుకు చెప్పారు. ఆయన కూడా.. ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదు.. పేద ప్రజలకు రూ. వేల కోట్ల లాభం జరుగుతుంది కదా అని అన్నారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే, దానికి చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. వీరిద్దరిదీ డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు. ప్రధాని సాయంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్నను రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యమని కంపెనీ వాళ్లను కోరినప్పుడు.. వాళ్లు మాకు 3 అంశాల్లో క్లారిటీ కావాలని అడిగారు. వెంటనే సీఎం ప్రధానిని కలిసి చెప్పగా.. ఆయన వెంటనే అంగీకరించారు. ఆయన సహకారం వల్లే భారత్లో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. గూగుల్ ఏఐ హబ్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలు, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది.
మోదీ ఏది ప్రారంభించినా విజయమే
నరేంద్ర మోదీ అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ను పవర్ ఫుల్ స్టేట్గా మార్చారు. ఇప్పుడు దేశాన్ని సూపర్ పవర్గా మారుస్తున్నారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు అమెరికా వద్దకో, ఇతర దేశాల దగ్గరకో వెళ్లి సాయం కోరేవి. మోదీ రూటే సెపరేటు. పహల్గావ్ దాడికి ప్రతిగా ఆయన కొట్టిన దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మ తిరిగిపోయింది. అమెరికా టారిఫ్లు పెంచితే పెద్ద పెద్ద దేశాలు వణికిపోయాయి. మోదీ మాత్రం ఆత్మనిర్బర్ భారత్ వంటి కార్యక్రమాలతో ధైర్యంగా సాగుతున్నారు. మోదీకి దేశ ప్రజలంటే నమ్మకం.. ప్రజలకు మోదీ అంటే నమ్మకం. ఆ నమ్మకమే దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తోంది.