Justice Ravinath Tilhari: నల్సా సంవాద్తో ఆదివాసీల జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:56 AM
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలకమైన ఘట్టమని, నల్సా సంవాద్ పథకం ద్వారా గిరిజన ఆదివాసీ, సంచార జాతుల అభ్యున్నతి కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ కృషి చేస్తుందని హైకోర్టు...
న్యాయ సేవాధికార సంస్థ చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలక ఘట్టం: జస్టిస్ రవినాథ్ తిల్హరి
ఎ.కొండూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చరిత్రలో గిరిజన న్యాయ జాగృతి కీలకమైన ఘట్టమని, నల్సా సంవాద్ పథకం ద్వారా గిరిజన ఆదివాసీ, సంచార జాతుల అభ్యున్నతి కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ కృషి చేస్తుందని హైకోర్టు న్యాయమూర్తి, స్టేట్ లీగల్ సర్వీసు అధారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హారి అన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురంలో రాష్ట్ర, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ, జిల్లా పరిపాలనా యంత్రంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న గిరిజన న్యాయ జాగృతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులను కాపాడేందుకు, గిరిజన, ఆదివాసీ, సంచార జాతుల వెనుకబాటును గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం సంస్థ పనిచేస్తోందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తునట్టు తెలిపారు. ఎ.కొండూరు మండలంలో ఎక్కువగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి ప్రత్యేక వైద్య సేవలు, ఆరోగ్య శిబిరాలు, డయాలసిస్ కేంద్రాలు శ్వాశత సేవలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ర్టిక్, సెషన్స్ జడ్జి జి.గోపి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ అందజేస్తున్న సేవల్ని ప్రతి గిరిజనుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ సమస్య పరిష్కరం కోసం సురక్షితమైన తాగు నీరు పైపులైన్ ద్వారా అందజేస్తున్నామని, త్వరలో పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరుగుతుందన్నారు. అంతకుముందు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఏర్పాటు చేసిన, వైద్య, విద్య, గిరిజన, ఎస్సీ సంక్షేమ శాఖ, వ్యవసాయ, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను జస్టిస్ రవినాథ్ తిల్హరి పరిశీలించారు. మండలంలోని 32 డ్వాక్రా సంఘాలకు బ్యాంక్ లింకేజి రుణాలు రూ.4.70 కోట్లు, నవోదయ 2.0 ద్వారా 5 కుటుంబలకు రూ.10 లక్షల చెక్కులు అందజేశారు.