Minister Nadendla Manohar: వ్యాపారానికి కచ్చితమైన భరోసా
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:24 AM
వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఏపీ కచ్చితమైన భరోసా ఇస్తోందని అన్నారు. విశాఖ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువతకు సరైన అవకాశాలు, గుర్తింపు, గౌరవం కల్పిస్తామని...
నాదెండ్ల మనోహర్
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఏపీ కచ్చితమైన భరోసా ఇస్తోందని అన్నారు. విశాఖ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువతకు సరైన అవకాశాలు, గుర్తింపు, గౌరవం కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా, దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును చంద్రబాబే ప్రారంభించారని, దానివల్ల హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రమే మారిపోయిందని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు అన్నారు. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతోందని, తూర్పు ప్రాంతానికి ఆర్థిక రాజధానిగా వైజాగ్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ సీఎండీ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. దాదాపు 1000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండడం వల్ల భారత్కి ఏపీ గ్రోత్ ఇంజన్లా మారిందన్నారు. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి మాట్లాడుతూ ఏపీలోని నౌకా నిర్మాణ రంగంతో పాటు, మిగతా ఉత్పాదక రంగం అభివృద్ధి వల్ల భారత్ ఉత్పాదక రంగం ఊపందుకుంటుందన్నారు.
భాగస్వామ్య సదస్సుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు
పవన్ ప్రతినిధిగా మంత్రి నాదెండ్ల హాజరు
విశాఖలో ప్రారంభమైన భాగస్వామ్య సదస్సుకు కూటమి పార్టీలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రారంభ వేదికపై మంత్రులు లోకేశ్, టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ ఆశీనులయ్యారు. మిగిలిన మంత్రులు, ప్రజాప్రతినిధులు వేదిక ముందు వరుసలో కూర్చున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్, వాసంశెట్టి సుభాష్, సవిత, కొలుసు పార్థసారథి, బీసీ జనార్దనరెడ్డి, రాంప్రసాద్రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరిలో కొందరు పలు ప్లీనరీల్లో ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్, సీపీ శంఖబ్రాత బాగ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు.