MLC Jaya Mangala Venkataramana: నా రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:15 AM
తన రాజీనామా లేఖపై తగిన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసేలా శాసనమండలి చైర్మన్ను ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ జయమంగళ
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తన రాజీనామా లేఖపై తగిన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసేలా శాసనమండలి చైర్మన్ను ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాతపూర్వక వివరాలను కోర్టు ముందు ఉంచాలని శాసనమండలి చైర్మన్, కార్యదర్శి తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావును హైకోర్టు ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జయ మంగళ వెంకటరమణ గత ఏడాది నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసన మండలి చైర్మన్కు లేఖ సమర్పించారు. 9నెలలు గడుస్తున్నా దానిని ఆమోదించడంకానీ, తిరస్కరించడంకానీ చేయడం లేదని జయమంగళ పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని నిబంధన 186, అధికరణ 190(3)బి ప్రకారం రాజీనామా సమర్పించాక దానిని ఆమోదించడంగానీ, తిరస్కరించడంగానీ చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత చైర్మన్పై ఉందని పేర్కొన్నారు.