MLA Kandikunta Venkata Prasad: సునీత పోరాటానికి మద్దతు
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:41 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత పోరాటానికి మద్దతుగా నిలబడతామని శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
దోషులను ప్రజల ముందు పెట్టడానికి సహకరించాలంటూ రెండుసార్లు లేఖలు: ఎమ్మెల్యే కందికుంట
కదిరి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత పోరాటానికి మద్దతుగా నిలబడతామని శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరిలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసును నిగ్గుతేల్చాలని, దోషులేవరో ప్రజల ముందు నిలపెట్టాలని ఆయన కూతురు సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ మద్దతుగా నిలుస్తుంది. రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆమె రెండుమార్లు లేఖలు రాశారు. తన తండ్రి హత్యకు కారుకులేవరో తేల్చేందుకు మద్దతు కోరారు. ఆమె పోరాటం మానవత్వం ఉన్న అందరికీ స్ఫూర్తి. నాపై సీబీఐ కేసులు ఉన్నప్పుడు వాటిని త్వరగా విచారించాలని మేమే కోర్టును కోరాం. జగన్, ఆయన పార్టీ నాయకులు వారిపై ఉన్న కేసులను త్వరగా విచారించాలని కోర్టులను అడగలరా? కదిరిలో సునీత పోరాటానికి మద్దతుగా సంతకాల సేకరణ చేపడతా. ఊరూరా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తాం. వివేకా హత్యకు కదిరిలో గొడ్డలి కొని, ఊరి పరువు తీశారు. వైద్య కళాశాలల విషయంలో జగన్ కోటి ఫోర్జరీ సంతకాల సేకరణ చేస్తున్నారు’ అని కందికుంట ఎద్దేవా చేశారు.