Rajamahendravaram Central Jail: జైల్లో లొంగిపోయిన మిథున్రెడ్డి
ABN , Publish Date - Sep 12 , 2025 | 05:04 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో లొంగిపోయారు.
జైలు బయట వేడుకగా పుట్టినరోజు
పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణుల హాజరు
స్తంభించిన ట్రాఫిక్.. చిక్కుకున్న అంబులెన్స్
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లో లొంగిపోయారు. రిమాండు ఖైదీగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నెల 6న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన జైలు సూపరింటెండెంట్ ఎదుట లొంగిపోయారు. అంతకుముందు సుమారు 25 కార్ల కాన్వాయ్తో జైలు బయట ఉన్న ఓ ప్రైవేటు హోటల్ వద్ద చేరుకొని ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. వైసీపీ నాయకులు పూలబొకేలు అందజేసి, పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. పండితులు వేదాశీర్వచనం అందించారు. దీంతో జైలు బయట రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఆస్పత్రికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీనిపై జనం మండిపడ్డారు.