Interim Bail: మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:44 AM
మద్యం స్కాం కేసులో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకే
11న తిరిగి లొంగిపోవాలని కోర్టు ఆదేశం
విజయవాడ, రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మద్యం స్కాం కేసులో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. మద్యం స్కాంలో ఏ4గా ఉన్న మిథున్రెడ్డిని జూలై 19న సిట్ అరెస్టు చేసింది. ఎంపీ అయిన తనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై న్యాయాధికారి పి.భాస్కరరావు శనివారం తీర్పు వెలువరించారు. తిరిగి 11న సాయంత్రం ఐదు గంటలకు మిథున్రెడ్డి లొంగిపోవాలని స్పష్టం చేశారు. మిథున్రెడ్డి శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలై నేరుగా వైసీపీ నేత జక్కంపూడి గణేశ్ ఇంటికి వెళ్లారు.