Palakollu: వైభవంగా మంత్రి నిమ్మల కుమార్తె వివాహం
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:18 AM
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ, పవన్ల వివాహం వైభవంగా జరిగింది.
వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు, లోకేశ్
పాలకొల్లు అర్బన్/ టౌన్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ, పవన్ల వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, మంత్రి లోకేశ్ హాజరై వఽధూవరులను ఆశీర్వదించి నూతన వస్ర్తాలు బహూకరించారు. పాలకొల్లు బైపాస్ రోడ్డులోని 16 ఎకరాల్లో భారీ టెంట్లతో వివాహ వేదికను ఏర్పాటు చేశారు. సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబు దంపతులు, లోకేశ్లకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అక్కడ నుంచి 2,000 వేల మందికిపైగా ప్రత్యేక దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు పూలు జల్లు తూ సీఎంకు స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు పసుపు చొక్కాలతో సందడి చేశారు. వధూవరులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. మంత్రి నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి దంపతులు, వరుడు తల్లిదండ్రులు యిర్రింకి వెంకట సూర్య సత్యనారాయణ, కరుణామణి దంపతులతో ముచ్చటించారు. గంటకుపైగా ఇక్కడ గడిపిన అనంతరం సీఎం తిరిగి వెళ్లారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ, మాజీ మంత్రులు తోట సీతారామలక్ష్మి, కొత్తపల్లి సుబ్బారాయుడు, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు.