Minister Nadendla Manohar: రేపటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:32 AM
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ఈ నెల 3 నుంచి ప్రారంభించనుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆరుగొలను గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్...
48 గంటల్లోపే ఖాతాల్లో నగదు జమ
ముందస్తుగా వాట్సాప్ ద్వారా రిజిస్ర్టేషన్
ఆరుగొలనులో ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ఈ నెల 3 నుంచి ప్రారంభించనుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆరుగొలను గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి 51 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలతోపాటు 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గోనెసంచులు, ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలనుకునే రైతులు 7337359375 వాట్సాప్ నంబరుకు ‘హాయ్’ అని సందేశం పంపి తమ వివరాలు నమోదు చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.