Minister Nadendla Manohar: దళారుల వ్యవస్థ నిర్మూలనకు యాప్
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:18 AM
దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
శ్రీకాకుళం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ను తీసుకువస్తున్నామని, స్థానిక పోలీసు స్టేషన్కు ఈ యాప్ వివరాలు అనుసంధానం చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో సోమవారం సివిల్ సప్లయ్ కమిషనర్ సౌరభ్గౌర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిలానీ సమూన్తో కలసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత ప్రభుత్వంలో నాయకులకు రైతులు భయపడేవారు. అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తరలించుకోవచ్చు. ధాన్యం కొనుగోలు చేసిన ఒకటి, రెండు రోజుల్లోనే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. కేంద్రప్రభుత్వ సహకారంతో ఈ దఫా ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ చేయించి.. బియ్యాన్ని అందిస్తాం’ అని స్పష్టం చేశారు.