Minister Lokesh: సమస్యల పరిష్కారమే ఎజెండా
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:21 AM
సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజాదర్బార్ కొనసాగుతోంది. మంత్రి నారా లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో...
76వ రోజు మంత్రి లోకేశ్ ప్రజా దర్బార్
వినతులు స్వీకరించి అండగా ఉంటామని భరోసా
మంగళగిరి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజాదర్బార్ కొనసాగుతోంది. మంత్రి నారా లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా ఆయన అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు లోకేశ్ను కలసి సమస్యలు విన్నవించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవదాయ శాఖ కింద వివిధ దేవాలయాల్లో ఖాళీగా వున్న నాదస్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అఖిల భారత నాయీబ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సేవ, సంక్షేమ, జాతి ప్రక్షాళన సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం శిక్షణ పొంది, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతోపాటు వయస్సు సడలింపు ఇవ్వాలని కోరారు. 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసం వుంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటకు చెందిన గ్రామస్తులు విన్నవించారు. అన్నమయ్య జిల్లా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటావూరలో 60 కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయని, బాధితుల సమస్యలు పరిష్కరించడంతోపాటు త్వరితగతిన నష్టపరిహార నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు. టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ పాలనలో తనపైన, తన కుటుంబంపైన 42 అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని, తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించిన లోకేశ్ తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.