Share News

Minister Lokesh: జనవరిలో మరో డీఎస్సీ

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:18 AM

ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో శుభవార్త! మెగా డీఎస్సీ ద్వారా ఇప్పటికే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం..

Minister Lokesh: జనవరిలో మరో డీఎస్సీ

  • నోటిఫికేషన్‌ తర్వాత మార్చిలో రాత పరీక్షలు

  • ఈ ఏడాది నవంబరులో ‘టెట్‌’ నిర్వహణ

  • విద్యా శాఖ అధికారులకు మంత్రి లోకేశ్‌ ఆదేశాలు

  • ఏటా డీఎస్సీ నిర్వహణకు కట్టుబడి ఉన్నామని వెల్లడి

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో శుభవార్త! మెగా డీఎస్సీ ద్వారా ఇప్పటికే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం.. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. అదే ఏడాది మార్చిలో రాత పరీక్షలు నిర్వహించి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది నవంబరు చివరి వారంలో టెట్‌ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌, కళాశాల విద్య ఉన్నతాధికారులతో గురువారం మంత్రి లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2026 జనవరిలో నోటిఫికేషన్‌, మార్చిలో డీఎస్సీతో పాటు స్పెషల్‌ డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలి

విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపై లక్ష్య సాధనకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు డిసెంబరు కల్లా సిలబస్‌ పూర్తి చేసి, ఆ తర్వాత 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 జవహర్‌ నవోదయ విద్యాలయాలకు సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రోజున నిర్వహించనున్న ‘స్టూడెంట్‌ అసెంబ్లీ’కి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్‌తోపాటు తాను కూడా హాజరవుతానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 78 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్‌కు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.


హైస్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద అందించాల్సిన స్టూడెంట్‌ కిట్స్‌పై లోకేశ్‌ చర్చించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కడప స్మార్ట్‌ కిచెన్‌ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైస్కూళ్లలో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఇతర కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సెంట్రల్‌ లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి డిజైన్‌ కోసం హ్యాకథాన్‌ నిర్వహించి, మెరుగైన మోడల్‌ను ఎంపిక చేయాలని పేర్కొన్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీల ఆధునికీకరణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సును రాబట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హైస్కూలు ప్లస్‌లను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. త్వరలో ప్రారంభించబోయే ‘కలలకు రెక్కలు’ పథకం విధివిధానాలపైనా సమావేశంలో చర్చించారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 వినతులు తమ దృష్టికి రాగా, ఇప్పటికే 200 పరిష్కరించామని, మిగిలిన వినతులు విధానపరమైన, ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు.

Updated Date - Oct 10 , 2025 | 04:19 AM