Minister Kondapalli Srinivas: డ్వాక్రా మహిళలకు సకాలంలో రుణాలు: కొండపల్లి
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:25 AM
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు నెలకొల్పే మహిళలకు సకాలంలో బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను మహిళా వ్యవస్థాపకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, కొత్త సంస్థల ఏర్పాటుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలోని ‘సెర్ప్’ కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.578.08 కోట్లతో 39,371 మంది మహిళలు వ్యాపార, సేవా, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయగా.. మిగిలిన లక్ష్యాలను వచ్చే మార్చిలోగా సాధించాలి. డ్వాక్రా మహిళలను వ్యవస్థాపకులుగా తయారు చేయడానికి విశాఖ ఐఐఎంను ఇంక్యుబేషన్ సెంటర్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 150 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.