Minister Kollu Ravindra: జగన్ ఆరోపణలపై విచారణకు సిద్ధం
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:56 AM
నకిలీ మద్యంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారు. ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం ఉందని ఆయన చేసిన ఆరోపణలపై విచారణకు మేం సిద్ధం
నకిలీ మద్యంపై విష ప్రచారం... నిరూపించలేకపోతే విచారణను ఎదుర్కొంటారా
ములకల చెరువు కేసులో అద్దేపల్లిపై లుక్ అవుట్ నోటీసు: మంత్రి కొల్లు
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ‘నకిలీ మద్యంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారు. ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం ఉందని ఆయన చేసిన ఆరోపణలపై విచారణకు మేం సిద్ధం. నిరూపించలేకపోతే విచారణ ఎదుర్కొవడానికి జగన్ సిద్ధమా?’ అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. నిజా నిజాలు నిగ్గు తేలుస్తాం. నిరాధార కథనాలు రాసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. వారిపై బీఎన్ఎస్ 353 కింద, అలాగే తప్పుడు వార్తలు, ప్రసారాలు ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారిపై బీఎన్ఎస్ 356 కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ములకల చెరువులో నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు అద్దేపల్లి ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తాం. నకిలీ మద్యం వ్యవహారంలో అధికారులతో సహా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవు. ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావుపై జగన్ ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి’ అని మంత్రి కొల్లు ప్రశ్నించారు.