Anam Ramnarayan Reddy: పబ్జీ ఆడుకునేవాడికి పాలనేమి తెలుసు
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:55 AM
ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటూ లక్షల కోట్లు దోపిడీ చేసేవానికి ప్రజాపాలన ఏమి తెలుసని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.
దేవదాయశాఖ మంత్రి ఆనం వ్యాఖ్యలు
పెద్దదోర్నాల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని పబ్జీ ఆడుకుంటూ లక్షల కోట్లు దోపిడీ చేసేవానికి ప్రజాపాలన ఏమి తెలుసని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా వైపాలెం నియోజకవర్గం పెద్దదోర్నాలలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. వెలిగొండ పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశానని, వాననీటిని నిల్వ చేసి కట్టలు తెంచి హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి కుప్పానికి నీళ్లిచ్చానంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూసిన ఘనుడు జగన్రెడ్డి అని ధ్వజమెత్తారు. కానీ, ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అవరోధాలు ఎదురైనా అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అన్ని పథకాలనూ అమలు చేస్తున్న దార్శనికుడు చంద్రబాబు అని కొనియాడారు.
అధికారం కోల్పోయినా బుద్ధి మారలేదు: మంత్రి సుభాష్
అహంకారం, అహంభావంతో అధికారం కోల్పోయినా జగన్రెడ్డికి ఇంకా బుద్ధి మారలేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆక్షేపించారు. చీకటి పాలన చేసిన జగన్ అధికారం కోల్పోవడంతో పిచ్చిపట్టినట్లుందని, ఏవేవో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
