Minister Achchenna: మద్దతు ధరలపై చర్చకు సిద్ధమా
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:39 AM
మద్దతు ధరలు, రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్కు లేదు. పంట ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు రైతులను జగన్ ఏం ఆదుకున్నాడో...
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘మద్దతు ధరలు, రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్కు లేదు. పంట ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు రైతులను జగన్ ఏం ఆదుకున్నాడో బహిరంగ చర్చకు రావాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. ఉల్లి, టమాటా రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఒక ప్రకటన జారీ చేశారు. ‘ధరలు తగ్గినప్పుడు మద్దతు ధర కల్పించి రైతులకు న్యాయం చేస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. వినియోగదారులకు సరసమైన ధరకు ఉత్పత్తులు అందేలా రాయితీ ఇస్తున్నాం. ఈ ఏడాది డిమాండ్కు మించి ఉత్పత్తి వచ్చి.. ఉల్లి ధర పతనమైతే క్వింటా రూ.1,200కు కొనుగోలు చేసి, రైతుబజార్లలో కిలో రూ.15కు అమ్ముతున్నాం. మద్దతు ధర కన్నా తక్కువ పలికితే.. వ్యత్యాస ధరను రైతులకే చెల్లిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 9వేల క్వింటాళ్ల ఉల్లిని రైతుబజార్లకు పంపాం. ధర వ్యత్యాసం కింద 51,268 క్వింటాళ్లు సేకరించాం. బిగ్ బాస్కెట్ వంటి సంస్థల్లో కిలో రూ.34 ఉంటే.. రైతులకు ధర ఎందుకు లేదంటున్న జగన్.. తన హయాంలో ఉల్లి రైతులకు చేసిన మేలు ఏంటో చెప్పగలడా?’ అని మంత్రి ప్రశ్నించారు.