Accident: అరకు ఘాట్రోడ్డులో మినీ బస్సు బోల్తా
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:21 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్రోడ్డులో హెయిర్ పిన్ బెండ్-1 వద్ద మంగళవారం సాయంత్రం ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన మినీ బస్సు బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది.
డ్రైవర్ సహా ముగ్గురు పర్యాటకులకు తీవ్ర గాయాలు
14 మందికి స్వల్పగాయాలు
క్షతగాత్రులు రాజమహేంద్రవరం వాసులు
బస్సు బ్రేకులు ఫెయిలు కావడంతో ప్రమాదం
అనంతగిరి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్రోడ్డులో హెయిర్ పిన్ బెండ్-1 వద్ద మంగళవారం సాయంత్రం ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన మినీ బస్సు బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు రెండు చేతులు విరిగిపోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 14 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా అరకు అందాలను తిలకించి రాజమహేంద్రవరం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్ఐ డి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ఓ బ్యూటీపార్లర్లో పని చేస్తున్న పది మంది యువకులు, యజమాని కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అరకులోయ అందాలను తిలకించేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన మినీ బస్సులో మంగళవారం వేకువజామున అరకులోయ వచ్చారు. అరకులోయ పరిసర ప్రాంతాలను తిలకించి, మధ్యాహ్నం బొర్రా గుహలు సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఘాట్రోడ్డు హెయిర్పిన్ బెండ్-1 మలుపు వద్దకు వచ్చే సరికి బస్సు బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కుమారస్వామి రెండు చేతులు విరిగిపోగా, అందులో ఉన్న లక్ష్మి, గీత, వీరబాబు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అనంతగిరి ఎస్ఐ డి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నలుగురిని 108 వాహనంలో, మిగతా 14 మందిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు.