Ration Distribution: రేషన్లో మళ్లీ రాగులు, జొన్నలు
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:07 AM
ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేస్తోంది.
సీమ జిల్లాల్లో ఏప్రిల్ నుంచే పంపిణీ.. ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలకు విస్తరణ
కొన్ని జిల్లాలకు రాగులు, మరికొన్నింటికి జొన్నలు
3 కేజీల వరకు బియ్యం మినహాయించి ఉచితంగానే పంపిణీ
అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేస్తోంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నం ద్యాల జిల్లాల్లో గత ఏప్రిల్ నుంచే ప్రజా పంపి ణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదారతోపాటు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. ఈ డిసెంబరు నెల నుంచి రాగుల పంపిణీని ఉత్తర కోస్తా ప్రాంతంలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు విస్తరించింది. ఎన్టీఆర్, గుం టూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జొన్నల పంపిణీని ప్రారంభించింది. ప్రభుత్వం మనిషికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తోంది. ఈ రేషన్లో కొంతమేర బియ్యానికి బదులుగా గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అంటే ప్రతినెలా 20 కేజీల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం.. ఇప్పుడు రెండు కేజీల రాగులు మాత్రమే కావాలనుకుంటే.. ఆ మేరకు బియ్యాన్ని మినహాయించుకుని, మిగిలిన 18 కేజీల బియ్యాన్ని, 2 కేజీల రాగులను అందిస్తారు. గతంలోనూ టీడీపీ ప్ర భుత్వం ఇదేవిధంగా రేషన్కార్డుదారులకు రాగు లు, రాగిపిండిని ప్యాకెట్ల రూపంలో పంపి ణీ చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రేషన్ సరుకుల్లో తృణ ధాన్యాలను అందించాలని నిర్ణయుంచింది.
రాష్ట్రప్రభుత్వమే సేకరించి..
అప్పట్లో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ఎఫ్సీఐ ద్వారా రాష్ట్రంలో పీడీఎస్ అవసరాలకు సరిపడా రాగులు, జొన్నలను కేటాయించేది. ఇప్పుడు కేంద్రం కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండరు ప్రక్రియ ద్వారా ప్రొక్యూర్ చేస్తూ కార్డుదారులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో వీటిని దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ పం పిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.