Metro Rail Tender Deadlines Extended: మెట్రో రైల్ టెండర్ల గడువు పొడిగింపు
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:53 AM
విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్టులకు టెండర్ల గడువును ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్..
విశాఖ మెట్రోకు అక్టోబరు 7.. బెజవాడ మెట్రోకు 14
విజయవాడ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్టులకు టెండర్ల గడువును ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్సీ) పొడిగించింది. విజయవాడ మెట్రోరైల్ టెండర్లు సెప్టెంబరు 19న తెరవాల్సి ఉండగా, అక్టోబరు 14 వరకు పొడిగించింది. అలాగే విశాఖపట్నం మెట్రో టెండర్లను అక్టోబరు 7వ తేదీకి పొడిగించింది. తొలిదశలో విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టును 38 కిలోమీటర్లు, విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్టును 46.23 కిలోమీటర్ల మేర నిర్మాణానికి టెండర్లు పిలిచారు. తాజాగా ఏపీఎంఆర్సీ అధికారులు కాంట్రాక్టు సంస్థలతో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకు మెట్రో టెండర్ల గడువును పొడిగించినట్టు ఏపీఎంఆర్సీ ఎండీ ఎన్పీ రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రకటించారు. గంపగుత్తగా టెండర్లు పిలిచిన పనులను స్ప్లిట్ చేయాలన్న ప్రతిపాదనలు ప్రధానంగా కాంట్రాక్టర్ల నుంచి వచ్చాయి. దీంతోపాటు రెండు, మూడు కాంట్రాక్టు సంస్థలు జాయింట్ వెంచర్గా ఏర్పడి పనులు చేపట్టేందుకు వీలుగా అవకాశం కల్పించాలని కోరినట్టు తెలిసింది.