Ichchapuram Post Office Fraud: ఖాతాదారుల సొమ్ము 2.86 కోట్లు హాంఫట్
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:13 AM
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం హెడ్ పోస్టాఫీసులో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఖాతాదారుల యూజర్ ఐడీలు ఉపయోగించి రూ.2.86కోట్లు దారి మళ్లించారు.
ఇచ్ఛాపురం పోస్టాఫీసులో సిబ్బంది చేతివాటం
14 మంది పాత్ర... ఐదుగురు సస్పెన్షన్
ఇచ్ఛాపురం, జూలై 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం హెడ్ పోస్టాఫీసులో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఖాతాదారుల యూజర్ ఐడీలు ఉపయోగించి రూ.2.86కోట్లు దారి మళ్లించారు. ఈ నెల 7న ప్రజావినతుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోస్టల్ అధికారులు తనిఖీకి ఆదేశించారు. పోస్టల్ ప్రాంతీయ తనిఖీ అధికారులు ఎన్.శ్రీకాంత్, కమల్హాసన్ శుక్రవారం ఇచ్ఛాపురం వచ్చి, విచారణ జరిపారు. బాధితులతోనూ మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్ఛాపురం కేంద్రంగా తపాలశాఖలో భారీ అవినీతి జరిగింది. ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశాం. ఇచ్ఛాపురం హెడ్ పోస్టాఫీసులో 33మంది ఖాతాదారుల నుంచి రూ.2.86 కోట్లు మళ్లించినట్లు గుర్తించాం. ఇందులో 14 మంది సిబ్బంది పాత్ర ఉన్నట్టు గుర్తించాం. ప్రస్తుతం ఐదుగురిని సస్పెండ్ చేశాము. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.
ఇంటి దొంగల పాత్ర..
పోస్టాఫీసు ఖాతాదారుల యూజర్ ఐడీ పోస్టల్ సబ్ డివిజన్లో 14మంది అధికారుల వద్దే ఉంటుంది. వారిలో ఎవరో ఒకరు సైబర్ నేరస్థుడితో చేతులు కలపడం ద్వారానే స్కాం జరిగే అవకాశం ఉంది. యూజర్ ఐడీలు ఉపయోగించి రూ.2.86 కోట్లు ఆన్లైన్ ద్వారా ఇతర ఖాతాలకు పంపించినట్లు తెలుస్తోంది. ఇందుకు బాధ్యులను చేస్తూ ఐదుగురు పోస్టల్ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది.