మండల ప్రత్యేకాధికారులకు మెగా పేరెంట్- టీచర్స్ మీట్ బాధ్యతలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:35 PM
వచ్చే నెల 5న ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్- టీచర్స్ మీట్ నిర్వహించాలని, ఈ బాధ్యతలను మండల ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే నెల 5న నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం
పాడేరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 5న ప్రతి పాఠశాలలో మెగా పేరెంట్- టీచర్స్ మీట్ నిర్వహించాలని, ఈ బాధ్యతలను మండల ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ విద్యా సంవత్సరం(2025-26)లో ఒకటో తరగతిలో చేరే విద్యార్థులకు జూలై మొదటి వారంలోనే తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని పేర్కొంది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరిని విధిగా ఒకటవ తరగతిలో చేర్పించాలని, ఇందుకు అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులను గుర్తించాలని, కలెక్టర్లు ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. రానున్న వారం రోజుల్లో ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధకనబరచాలని పేర్కొంది. డ్రాపవుట్స్, పాఠశాలకు దూరంగా ఉన్న వారినిగ్రామ సచివాలయాల వారీగా గుర్తించి వారందర్నీ విధిగా పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం సూచించింది. కాగా గతేడాది డిసెంబరు 7న ప్రతి పాఠశాలలో పండుగలా మెగా పేరెంట్- టీచర్స్ మీట్ను ఉపాధ్యాయులు నిర్వహించారు.