Visakhapatna: పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:45 AM
విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు-2025కు ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు-2025కు ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి మొత్తం 3 వేల మంది వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఐఐ పోర్టల్ ద్వారా ఇప్పటికే 2 వేల మంది తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలు దేశాలకు చెందిన రాయబారులు, అంతర్జాతీయ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు వంటి ప్రత్యేక ఆహ్వానితులు 800 మంది వరకు రానున్నారని చెప్పారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో సదస్సు కోసం జర్మన్ హ్యాంగర్లతో 8 హాళ్లు నిర్మించారు. కాగా, పెట్టుబడుల సదస్సుకు.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.