Machilipatnam: భక్తి శ్రద్ధలతో మొహర్రం
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:41 AM
మొహర్రంను పురస్కరించుకుని మచిలీపట్నంలో ఆదివారం వేలాది మంది ముస్లింలు చెస్ట్ బీటింగ్(మాతం) నిర్వహించారు. ‘గిరోహె మిరన్షా’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరోహె హజరత్ హుస్సేన్, ఇజ్జత్ దళాలు వేర్వేరుగా పాల్గొన్నాయి.
మచిలీపట్నం టౌన్/బనగానపల్లె, జూలై 6(ఆంధ్రజ్యోతి): మొహర్రంను పురస్కరించుకుని మచిలీపట్నంలో ఆదివారం వేలాది మంది ముస్లింలు చెస్ట్ బీటింగ్(మాతం) నిర్వహించారు. ‘గిరోహె మిరన్షా’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరోహె హజరత్ హుస్సేన్, ఇజ్జత్ దళాలు వేర్వేరుగా పాల్గొన్నాయి. వేలాది మంది ముస్లింలు రక్తతర్పణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర.. గాయపడిన వారికి కట్లు కట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఆదివారం వేలాది మంది షియా ముస్లింలు నల్ల దుస్తులు ధరించి మాతం నిర్వహించారు. దొరకోటలోని పీర్ల వద్ద నవాబు వంశీయుల వారసులు మీర్ ఫజుల్ అలీఖాన్, వారి కుటుంబ సభ్యులు, షియా ముస్లింలు పీర్ల వద్ద శోకతప్త హృదయాలతో ప్రార్థనలు చేశారు. పలువురు షియా ముస్లింలు దొరకోట వద్ద తలపై కత్తితో గాట్లు పెట్టుకుని అమరులైన ఇమాంహుస్సేన్ వారి కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణంలోని మొత్తం 40 పీర్ల చావిళ్ల నుంచి పీర్లు దొరకోట పీర్ల వెంట రాగా సాయంత్రం జుర్రేరువాగుకు చేరుకున్నాయి. అక్కడ పీర్లను శుద్ధి చేసి తిరిగి పీర్ల చావిళ్లకు చేర్చారు. ఇక్కడ నిర్వహించే మొహర్రం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది.