Cyclone Formation: 21 తర్వాత అల్పపీడనం
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:22 AM
దక్షిణ భారతంపైకి ఈ నెల 15వ తేదీ తర్వాత తూర్పు/ఈశాన్యగాలులు వీయనున్నాయి. దీంతో 16 లేదా 17న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
తుఫాన్గా బలపడే చాన్స్?.. భారీ వర్షసూచన
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతంపైకి ఈ నెల 15వ తేదీ తర్వాత తూర్పు/ఈశాన్యగాలులు వీయనున్నాయి. దీంతో 16 లేదా 17న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో దీపావళికి కోస్తాంధ్ర, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 21 తర్వాతఅల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం రానుందని పలు వాతావరణ మోడళ్లు చెబుతున్నాయి. కాగా ఉత్తరకోస్తా పరిసరాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి దక్షిణ కోస్తా పరిసరాల్లో ఆవరించింది. దీని ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఆదివారం నుంచి మూడ్రోజులపాటు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.