Minister Lokesh: పెట్టుబడులతో రండి
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:49 AM
రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నవంబరు....
విశాఖ సదస్సుకు విదేశీ భాగస్వాములను ఆహ్వానిస్తూ లండన్లో లోకేశ్ రోడ్ షో
పాల్గొన్న ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు
రాష్ట్రంలో లక్ష ఎకరాలతో పారిశ్రామిక క్లస్టర్లు
15 నెలల్లో 10.06 లక్షల కోట్ల పెట్టుబడులు
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ విధానాలు
గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించిన మంత్రి
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో ప్రపంచస్థాయి పెట్టుబడుల భాగస్వాములను ఆహ్వానించేందుకు మంత్రి లోకేశ్ మంగళవారం లండన్లో అత్యున్నత స్థాయి పెట్టుబడిదారులతో రోడ్షో నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ర్యాలీలో యూకే డిప్యూటీ హైకమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్దూల్ అస్నానీ, ఐసీఐసీఐ బ్యాంకు యూకే విభాగం సీఈవో రాఘవ్ సింఘాల్, గ్లోబల్ ఫండ్, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈవోలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల స్నేహ పూర్వక విధానాలు, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను లోకేశ్ వివరించారు. గత 15 నెలల కాలంలో రాష్ట్రానికి రూ. 10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులను తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం లక్ష ఎకరాల భూమి కలిగిన పారిశ్రామిక క్లస్టర్లను అందుబాటులో ఉంచామని గ్లోబల్ ఇన్వెస్టర్లకు లోకేశ్ వివరించారు. మరో ఏడాదిలో పెట్టుబడులను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై గ్లోబల్ ఇన్వెస్టర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. విశాఖలో నిర్వహించే పార్టనర్షిప్ సమ్మిట్కు భారీ పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు.