Delhi Visit: ఢిల్లీలో లోకేశ్
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:00 AM
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సోమవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు.
నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
వివిధ ప్రతిపాదనల సమర్పణ
21న వెళ్లనున్న సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సోమవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ, షిప్పింగ్- జలరవాణా మంత్రి సర్బానంద్ సొనోవాల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జైశంకర్తో కూడా ఆయన భేటీ అవుతారు. పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. రాష్ట్రప్రభుత్వం తరఫున వివిధ ప్రతిపాదనలను వారికి సమర్పిస్తారు. మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు 21న ఢిల్లీ వెళ్లనున్నారు. 22న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు.
స్వాతంత్య్ర పోరాటాన్ని జగన్ అవమానించారు: లోకేశ్
స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనమే కాకుండా స్వాతంత్య్ర పోరాటాన్ని అవమానించడం కూడా అని మంత్రి లోకేశ్ అన్నారు. దేశాన్ని అవమానించినందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. ‘వైఎస్ జగన్ ఇన్సల్ట్స్ నేషన్’ అని ట్యాగ్ లైన్ పెట్టారు.