Lokesh Claims: మన కంటే ప్రధానికే బాగా తెలుసు
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:53 AM
జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరి కంటే ప్రధాని మోదీకి బాగా తెలుసని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్.....
మద్యం స్కాంలో వైసీపీ అడ్డంగా దొరికింది: లోకేశ్
ఇక ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్
మీడియాతో ఇష్టాగోష్ఠిలో విద్యామంత్రి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరి కంటే ప్రధాని మోదీకి బాగా తెలుసని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. ప్రధానితో ఇటీవలి భేటీలో తానేమీ ప్రత్యేకంగా వైసీపీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాజకీయంగా, అభివృద్ధిపరంగా ప్రధాని తనకు సలహాలిచ్చారని చెప్పారు. యోగాంధ్రను నెల రోజులు ఎలా నిర్వహించామో.. జీఎ్సటీ సంస్కరణలను కూడా అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మేకిన్ ఇండియాను ప్రమోట్ చేయాలని సూచించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫీడ్బ్యాక్ తీసుకున్నానని, ప్రధాని రాజకీయ ఇన్పుట్స్ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి పాలనలో గంజాయి సాగు భారీగా తగ్గిందని చెప్పారు. 100 శాతం నిర్మూలించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. నక్సలిజం దాదాపు అంతిమ దశకు చేరుకుందన్నారు. లోకేశ్ ఇంకా ఏం చెప్పారంటే..
అవినీతి జరగలేదని ఎవరూ అనడం లేదు..
లిక్కర్ స్కాంకు సంబంధించి వైసీపీలో ఏ ఒక్కరూ కూడా అవినీతి జరగలేదని చెప్పడం లేదు. ఆ పార్టీ ఈ కుంభకోణంలో అడ్డంగా దొరికింది. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణాలు వాటంతట అవే బయటకు వస్తాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆ విషయంలో నేనెలా జోక్యం చేసుకుంటాను? న్యాయ ప్రక్రియను అడ్డుకోవడంలో జగనే నిష్ణాతుడు. జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు. పులివెందుల మెడికల్ కాలేజీ బిల్డింగ్ మాత్రమే కట్టారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తికాలేదు. మిగతా మెడికల్ కాలేజీలకు పునాదులు మాత్రమే వేశారు. కొత్త కాలేజీలన్నీ 2028 వరకు నిర్వహణలోకి వస్తాయి. పాఠశాల విద్య ప్రణాళికను ఒకేసారి మార్చడం కుదరదు. ఏటా ఒక్కో తరగతికి మార్చాల్సి ఉంటుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియమాకాల భర్తీని ఒకే క్యాలెండర్ ఇయర్లో చేపట్టాం. ఇక నుంచి ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. విశాఖలో టీసీఎస్ ఈ నెల లేదా అక్టోబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కాగ్నిజెంట్ కూడా మొదలవుతుది. గత ఎన్నికల్లో టీడీపీకి సీమ ప్రజలిచ్చిన మద్దతును నిలబెట్టుకుంటాం. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయదు. అక్కడ ఏ పార్టీకి మద్దతిచ్చేదీ చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు.
మూడేళ్లలో అమరావతి
రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో తుది దశకు చేరుకుంటుంది. ఉండవల్లిలో ఇప్పుడు మేమున్న ఇంట్లో ఇటీవల చిన్న మార్పులు చే శాం. ఇందుకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయలేదు. అమరావతిలో కడుతున్న సొంత ఇంటికి కూడా మా సొంత నిధులు ఖర్చుచేస్తున్నాం. వచ్చే జనవరి, ఫిబ్రవరికల్లా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1, ఇతర ఉన్నతాధికారులు రాజధానిలో నిర్మించిన భవనాల్లోకి వెళ్తారు. అమరావతిలో దేశంలోకెల్లా అతిపెద్ద స్టేడియాన్ని నిర్మిస్తాం.
మీ విజయ రహస్యమేంటి?
జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో లోకేశ్
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను రాష్ట్ర మంత్రి లోకేశ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పోటీ చేసిన తొలి ఎన్నిక నుంచి గత నాలుగు విడతలుగా మెజారిటీ పెంచుకుంటూ గెలిచిన పాటిల్ను లోకేశ్ అభినందించారు. ఇంతలా ప్రజల అభిమానాన్ని చూరగొనడం వెనుక రహస్యం ఏమిటని వాకబు చేశారు. ఏపీలో గత 15నెలలుగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించారు. గుజరాత్లోని నవసారి లోక్సభ స్థానం నుంచి సీఆర్ పాటిల్ వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు.