Legislative Council :జగన్ ఇస్తానన్న కోటి సాయంపై విచారణ చేద్దామా?
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:36 AM
బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై శాసనమండలిలో మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది. నాడు పరామర్శకు వెళ్లి బాధితులకు మాజీ సీఎం జగన్ ప్రకటించిన రూ.కోటి సాయం ఏమైందో విచారణ కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమని..

ABN AndhraJyothi: బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై శాసనమండలిలో మంగళవారం వాడీవేడి చర్చ జరిగింది. నాడు పరామర్శకు వెళ్లి బాధితులకు మాజీ సీఎం జగన్ ప్రకటించిన రూ.కోటి సాయం ఏమైందో విచారణ కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమని.. వైసీపీ సభ్యులు రెడీయేనా హోంమంత్రి అనిత వైసీపీ సభ్యులకు సవాల్ విసిరారు. వరద బాధితులకు పూర్తి స్థాయిలో సాయం అందించలేదని, దరఖాస్తులు తీసుకుంటే లక్ష వస్తాయని వైసీపీ ఎమ్మెల్సీ రూహుల్లా చేసిన వ్యాఖ్యలపై ఆమె, మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం అందించింది. ఎక్కడా అసంతృప్తి లేదు. బుడమేరు వరదను రాజకీయం చేయొద్దు. ఎవరైనా పరిహారం అందలేదని ఇప్పుడు వచ్చినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా లక్ష మంది వస్తారంటూ పెద్దల సభలో కూర్చుని అసత్యాలు మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. వైసీపీ విధానాల వల్లే బుడమేరుకు వరద వచ్చిందని, దీనిపై చర్చకు తాము సిద్ధమని రవీంద్ర అన్నారు. వరద బాధితులకు జగన్ రూ.కోటి ఇచ్చారని, పాలు, నీరు, నిత్యావసరాలు అందజేశామని బొత్స తెలిపారు. బాధ్యత కలిగిన వారెవరైనా విరాళాలను ప్రభుత్వ వ్యవస్థకు ఇస్తారని, ప్రభుత్వానికి జగన్ ఏమీ ఇవ్వలేదని పార్థసారథి చెప్పారు.