Liquor Scam: బాక్స్లు బద్దలయ్యాయి
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:01 AM
దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కానీ మొట్టమొదట సారిగా స్కామ్కు సంబంధించిన నగదు పెద్ద మొత్తంలో దర్యాప్తు అధికారులకు దొరికిపోయింది.
లిక్కర్ స్కామ్ సొమ్ము11 కోట్లు సీజ్
ఇంత భారీ నగదు పట్టుబడటం దేశ చరిత్రలోనే తొలిసారి
హైదరాబాద్ సమీపంలోని ఫామ్హౌసలో స్వాధీనం
12 అట్ట పెట్టెల్లో నోట్ల కట్టలు
దుబాయ్ నుంచి వస్తుండగా శంషాబాద్లో ఏ-40 వరుణ్ అరెస్ట్
అతడిచ్చిన సమాచారంతో సోదాలు
ఫామ్హౌస్ యజమాని కసిరెడ్డి మిత్రుడే
విజయవాడకు నగదు, వరుణ్ తరలింపు
ఏసీబీ కోర్టుకు సిట్ సమాచారం
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వసూళ్ల బృందంలో ఏ-40 వరుణ్ పురుషోత్తం కీలకం. కసిరెడ్డి ఆదేశాల మేరకు బూనేటి చాణక్య, వరుణ్ పురుషోత్తం మద్యం ముడుపుల ద్వారా వచ్చిన రూ.11 కోట్ల నగదును 2024 జూన్లో హైదరాబాద్ శివారులోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత 2024 నవంబరులో సమీపంలోని ఫామ్హౌస్కు మార్చారు.
దుబాయ్కు పారిపోయిన వరుణ్ తిరిగి వస్తున్న విషయం తెలుసుకున్న సిట్ మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకుంది. లోతుగా విచారించగా ఫామ్హౌస్లో నగదు డంప్ విషయం బయటపడింది. వెంటనే సోదాలు నిర్వహించి 12 అట్టపెట్టెల్లో దాచి ఉంచిన 11 కోట్ల నగదును సిట్ స్వాధీనం చేసుకుంది.
నగదు దాచిన ఫామ్హౌస్ రాజ్ కసిరెడ్డి భార్య దివ్యారెడ్డి భాగస్వామిగా ఉన్న ఆరేట్ ఆస్పత్రిలో మరో భాగస్వామి తీగల బాల్రెడ్డి కుటుంబానికి చెందినది. ఆయన భార్య సులోచన పేరు మీద ఈ ఫామ్హౌస్ ఉంది. బాల్రెడ్డి కుమారుడు తీగల విజయేందర్రెడ్డి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని.
అమరావతి/రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్ రూరల్, జూలై 30(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కానీ మొట్టమొదట సారిగా స్కామ్కు సంబంధించిన నగదు పెద్ద మొత్తంలో దర్యాప్తు అధికారులకు దొరికిపోయింది. కేసులో నిందితుడు ఇచ్చిన సమాచారంతో జరిపిన సోదాల్లో నోట్ల కట్టలు వెలుగు చూశాయి. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసి దాచిన రూ.11 కోట్ల నగదు డంప్ బయటపడింది. హైదరాబాద్ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఏడాదిగా దాచిన ఈ నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ కేసులో నిందితుడైన వరుణ్ పురుషోత్తం(ఏ-40) ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం వేకువజామున వారు సోదాలు చేశారు. రాజ్ కసిరెడ్డి సూచనతో ఫామ్హౌస్లో 12 బాక్సుల్లో జాగ్రత్తగా భద్రపరిచిన రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇవి లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి దాచి ఉంచిన ముడుపులేనని సిట్ ఆధారాలతో బయటపెట్టింది. నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్పై 11 కేసులు నమోదు చేసిన సీబీఐ, ఆరు కేసులు పెట్టిన ఈడీ కూడా ఇన్ని కోట్ల రూపాయల నగదు సీజ్ చేయలేదు. దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి.
అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే...
మద్యం స్కాంలో రూ.3,500 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు సిట్ నిర్ధారించింది. కుంభకోణం బయటకు రాగానే ఇందులో కీలకంగా ఉన్న కొందరిని పెద్దలు విదేశాలకు పంపించేశారు. వీరిలో కొందరికి దుబాయ్లో గోల్డ్ కార్డు కూడా ఇప్పించినట్లు తెలుస్తోంది. ఇలా విదేశాలకు పరారైన వారిలో ఏ-40 వరుణ్ పురుషోత్తంపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. విజయవాడ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించే యత్నాలను అధికారులు ముమ్మరం చేశారు. వరుణ్ పురుషోత్తం మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వస్తున్నట్లు తెలుసుకుని.. శంషాబాద్ ఎయిర్పోర్టులో అతడిని అరెస్ట్ చేశారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్హౌస్లో దాడులు నిర్వహించారు. నగదు స్వాధీనం చేసుకుని విజయవాడకు తరలించారు. వరుణ్ను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
కాఫీ షాపు నుంచి దుబాయి వరకు...
కేసు విచారణలో కీలకంగా ఉన్న వరుణ్ బయటపెడుతున్న విషయాలతో మద్యం కేసు మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు వరుణ్ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్కు చెందిన వరుణ్ ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్లోని ఓ కాఫీ షాపులో నెలకు రూ.32 వేల వేతనంతో పనిచేసేవాడు. అతడిని ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ కసిరెడ్డి బృందానికి పరిచయం చేసినట్లు సమాచారం. ఇలా కసిరెడ్డి డెన్లోకి ప్రవేశించిన వరుణ్ మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా మారాడు. లిక్కర్ గ్యాంగ్లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి.. ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ఆయన బినామీగా నడిపించిన ఆదాన్ డిస్టిలరీ్సతో పాటు పుదుచ్చేరికి చెందిన లీలా డిస్టిలరీస్ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నున్నలో చిరునామా చూపించి వరుణ్ను మొత్తం వ్యాపారానికి ఇన్చార్జిగా నియమించారు. అతడి పేరుతో బ్యాంకు ఖాతా తెరిపించి రూ.10 కోట్ల వరకు చెక్ పవర్ కల్పించారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి లీలా డిస్టిలరీ్సకు భారీగా మద్యం ఆర్డర్లు కట్టబెట్టారు. లీలా డిస్టిలరీస్ ద్వారా రూ.453.97 కోట్ల వరకు వ్యాపారం చేశారు. అందుకు ప్రతిఫలంగా 16 ఖాతాల్లోకి 52.78 కోట్ల ముడుపులు జమ చేశారు. అందులో 11 కోట్ల సొమ్ము అందుకున్న పొట్లూరి అంజిరెడ్డి, పియూష్ గడోడియా అనే వ్యక్తులు నోట్ల కట్టలు అట్ట పెట్లెల్లో పెట్టి కసిరెడ్డికి అందజేశారు. అతడు వరుణ్ ద్వారా తన ఎదురు విల్లాలో ఉండే తీగల విజయేందర్రెడ్డి, ఉపేందర్రెడ్డికి చెందిన వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. అంతకుముందు పలుమార్లు లిక్కర్ ముడుపులకు సంబంధించిన సమావేశాలు నిర్వహించిన సులోచన వ్యవసాయ క్షేత్రంలోకి తర్వాత తీసుకెళ్లారు. అక్కడి సిబ్బందికి అనుమానం రాకుండా కళాశాలకు చెందిన ఏ-4 సైజ్ పేపర్లంటూ లోపల దాచారు. గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక డబ్బులు భద్రంగా దాచేసిన రాజ్ కసిరెడ్డి.. వరుణ్ పురుషోత్తంను దుబాయ్కి పంపించేశాడు. వీటికి సంబంధించిన ఆధారాలను సిట్ సంపాదించింది.
ఫైళ్లు, బియ్యం బస్తాల మాటున..
నగదు బయటపడ్డ ఫామ్ హౌస్ యజమాని కుటుంబానికీ, రాజ్ కసిరెడ్డి కుటుంబానికీ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ఫామ్ హౌస్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ యజమాని తీగల బాల్రెడ్డి కుటుంబానికి చెందినది. ఆయన భార్య పేరిటే ఈ ఫామ్హౌస్ ఉంది. తీగల బాల్రెడ్డి, రాజ్ కసిరెడ్డి సతీమణి దివ్యా రెడ్డి... ఇద్దరూ ఆరేట్ ఆస్పత్రిలో భాగస్వాములు కావడం విశేషం. ఈ పరిచయంతోనే... లిక్కర్ స్కామ్ నగదు దాచేందుకు వీరి ఫామ్హౌస్ను వాడుకున్నట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్లోని స్టోర్ రూమ్లో ఫైళ్లు, బియ్యం బస్తాల మధ్య అట్టపెట్టెల్లో ఈ నగదును దాచి ఉంచారు. పక్కా సమాచారంతో వెళ్లిన సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదు గుర్తించి జప్తు చేశారు. ఈ వివరాలను ఈడీకి సిట్ తెలియజేసింది. ఐటీ కూడా దృష్టిసారించే అవకాశం ఉంది.
11 కోట్లను కోర్టులో భద్రపరచండి
ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్
శంషాబాద్ మండలం కాచారంలోని ఫాంహౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం కుంభకోణం సొమ్ము రూ.11 కోట్లను కోర్టులో భద్రపరచాలని సిట్ అధికారులు కోరారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం మెమో దాఖలు చేశారు. కేసులో ఏ-40గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుమతి ఫామ్హౌస్లో అట్టపెట్టల్లో దాచిన రూ.11 కోట్లు స్వాధీనం చేసుకొని, ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించామని తెలిపారు. ఈ మొత్తం డబ్బును కోర్టులో భద్రపరచాలని, లేదా బ్యాంక్లో ఎఫ్డీ రూపంలో జమ చేయడానికి అనుమతించాలని కోరారు.
చాణక్యను నమ్మి మోసపోయా..
వరుణ్ పురుషోత్తం విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. తాను ఉన్నత విద్యావంతుడినని, బూనేటి చాణక్యను నమ్మి అన్నివిధాలా జీవితాన్ని కోల్పోయానని కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. తనకు తెలియని లిక్కర్ బిజినెస్ లో దింపి ప్రభుత్వం మారగానే దుబాయ్కు తీసుకెళ్లాడని, సీఐడీ కేసు నమోదు చేసినప్పటి(2024 సెప్టెంబరు) నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని వాపోయినట్లు తెలిసింది. తీగల సోదరులు కూడా చాణక్యతో తరచూ సమావేశం అయ్యేవారని, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత దుబాయ్ వెళ్లేందుకు తమకు సహకరించారని వెల్లడించినట్లు సమాచారం. తమతో పాటు దుబాయ్ వచ్చిన బూనేటి చాణక్య సిట్ పిలుపుతో తిరిగొచ్చే సమయంలో.. ‘ఇది నిలబడే కేసు కాదు.. వెంటనే బెయిల్ తీసుకుని తిరిగొస్తా.. మీ పేర్లు చేర్చినా, 90 రోజులు దాటినా ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది.. అని ఇక్కడికి వచ్చాడు. అరెస్టై విజయవాడ జైల్లో ఖైదీలకు వంట చేస్తున్నాడు. దీంతో మాకు భయం పట్టుకుంది. రెడ్ కార్నర్ నోటీసు అనగానే అందరూ దుబాయ్ నుంచి వెనక్కి వద్దామని అనుకున్నాం. మిగతా వాళ్లు కూడా వచ్చేస్తారు’ అని సిట్ అధికారులకు వివరించినట్లు తెలిసింది.
ప్రతినెలా 40 లక్షల ఖర్చు
రాజ్ కసిరెడ్డి గ్యాంగ్లోని కీలక వ్యక్తి తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి(ఏ-9) సహా నిందితుల్ని దుబాయ్లోని దమాక్ బేస్ ఏడ్జ్లో రెండు ఫ్లాట్లు అద్దెకు తీసి పెట్టాడు. విలాసవంతమైన ఫ్లాట్లలో నివసించేందుకు ఒక్కొక్కరికి తొమ్మిది వేల నుంచి పదివేల దిర్హమ్లు అంటే.. రూపాయల్లో రెండు లక్షల నుంచి 2.40 లక్షలు ఇచ్చేవాడని తెలిసింది. కిరణ్ కుమార్ ఒక్కడే వేరే చోట ఉంటున్నాడని, అందరికీ కలిపి ప్రతి నెలా 40 లక్షల వరకూ ఖర్చు వస్తోందని సమాచారం. రాజ్ కసిరెడ్డి, బూనేటి చాణక్య ఇప్పట్లో బెయిల్పై వచ్చే అవకాశం లేనందున అక్కడ ఖర్చు భరించలేక ఇతర నిందితులు తిరిగొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు సిట్ అధికారులకు సమాచారం అందింది.