SIT Investigation: లిక్కర్ సొమ్ములో నొక్కేశారు
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:49 AM
గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో కొంతమొత్తాన్ని దేవదాయ శాఖ అధికారి నొక్కేశారు. ఈ వ్యవహారంలో ఓ మధ్యవర్తి పాత్ర కూడా ఉంది.
మహంకాళి ఆలయ పునఃనిర్మాణానికి కోట్ల విరాళమిచ్చిన వాసుదేవరెడ్డి
అప్పటి ఆలయ ఈవో, మధ్యవర్తి దోపిడీ
కుంభకోణం వెలుగు చూడడంతో విదేశాలకు పారిపోయిన ఈవో
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో కొంతమొత్తాన్ని దేవదాయ శాఖ అధికారి నొక్కేశారు. ఈ వ్యవహారంలో ఓ మధ్యవర్తి పాత్ర కూడా ఉంది. అక్రమ మద్యం వ్యాపారంలో కీలకపాత్ర పోషించిన నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తన పాపాన్ని కడిగేసుకునేందుకు దేవాలయాన్ని పునర్నిర్మించాలని భావించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి కోట్లలో విరాళం ఇచ్చారు. తన సామాజికవర్గానికి చెందిన ఈవో వెంకటరెడ్డికి అర్హత లేకపోయినా తనకున్న పవర్తో ఆ గుడి ఈవోగా బాధ్యతలు అప్పగింపచేశారు. ఆయనకు నిర్మాణ పనుల్లో సహకరించేందుకు అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తికి కూడా బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరు రూ.5-6 కోట్లు వాసుదేవరెడ్డి నుంచి తరలించుకొచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతేగాక గత ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి ద్వారా వాసుదేవరెడ్డి సీజీఎఫ్ గ్రాంట్ నుంచి కూడా రూ.కోటి మంజూరు చేయించారు. ఈవో వెంకటరెడ్డి, నాగేశ్వరరావు కుమ్మక్కై అందులో కొంత సొమ్ముతో నిర్మాణం చేపట్టి, రెండొంతులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజల వద్ద నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ఎవరు ఎంత ఇచ్చారు? ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు జరిగాయో వివరాలేవీ లేవు. గత ప్రభుత్వంలో వెంకటరెడ్డికి మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల, సీతానగరం, నూతక్కి గ్రూప్ దేవాలయాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కామ్పై సిట్ దర్యాప్తు చేపట్టడంతో ఎక్కడ ఈ కుంభకోణం వెలుగులోకి వస్తుందోనని ఆలయ పాత ఈవో వెంక టరెడ్డి ఇటీవల సెలవు పెట్టి విదేశాలకు వెళ్లిపోయారు.
ఆస్తులు కొన్న వాసుదేవరెడ్డి
మహంకాళి దేవాలయానికి వాసుదేవరెడ్డి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ గత ఏడాది ఆగస్టు 9న ‘వామ్మో వాసుదేవా’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. ఆయన దుగ్గిరాలలో రూ.14 కోట్లు ఖరీదు చేసే పొలం కొనుగోలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో బినామీల పేరుతో 50 ఎకరాలు సొంతం చేసుకున్నారు.
ఆ 11 కోట్లను ఎస్బీఐలో డిపాజిట్ చేయండి
మద్యం కుంభకోణంలో హైదరాబాద్ శివారు ప్రాంతం శంషాబాద్లోని కాచారంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు సిట్ అధికారులను ఆదేశించింది. విజయవాడ మాచవరంలోని ఎస్బీఐ బ్రాంచ్లో డిపాజిట్ చేయాలని సూచించింది. ఈ డబ్బును కోర్టులో భద్రపరచడం గానీ లేదా బ్యాంకులో డిపాజిట్ గానీ చేయాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన మెమోపై గురువారం ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు ఈ ఆదేశాలు ఇచ్చారు.