జీవనది.. దీనస్థితి
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:12 AM
జీవనదిగా పేరొందిన కృష్ణానది ఎండిపోతోంది. సాగర్ జలాలు కూడా రాకపోవటంతో చాలా చోట్ల బీడుగా మారింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కృష్ణానదిలో పుష్కలంగా నీరు కనిపిస్తున్నా.. అంతకు ఎగువన చందర్లపాడు మండలంలో కృష్ణానది పరిస్థితి ఘోరంగా ఉంది. బీడు వారిన నేలలతో పాటు మొక్కలు పెరుగుతూ అడవిలా మారింది. అక్కడక్కడ చిన్నపాటి నీటి మడుగులే కనిపిస్తున్నాయి. సాగునీటికే కాకుండా తాగునీటికీ కటకటలాడే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో 40 డిగ్రీలపైనే ఎండలు వీస్తాయని అంటున్నారు. ఇలాంటపుడు కృష్ణానదిలో ఉన్న నిల్వలు కూడా అడుగంటిపోతే రానున్న రోజుల్లో పెద్ద సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది
- బీడువారిన కృష్ణానది
- ఇసుక తవ్వకాలతో గతి తప్పిన పాయ
- కాసరబాద-జూపూడి వరకు అడుగంటిన నీరు
- చందర్లపాడు, ఇబ్రహీంపట్నం మండలాల్లో పొంచి ఉన్న తాగునీటి ముప్పు
జీవనదిగా పేరొందిన కృష్ణానది ఎండిపోతోంది. సాగర్ జలాలు కూడా రాకపోవటంతో చాలా చోట్ల బీడుగా మారింది. ప్రకాశం బ్యారేజీకి దిగువన విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కృష్ణానదిలో పుష్కలంగా నీరు కనిపిస్తున్నా.. అంతకు ఎగువన చందర్లపాడు మండలంలో కృష్ణానది పరిస్థితి ఘోరంగా ఉంది. బీడు వారిన నేలలతో పాటు మొక్కలు పెరుగుతూ అడవిలా మారింది. అక్కడక్కడ చిన్నపాటి నీటి మడుగులే కనిపిస్తున్నాయి. సాగునీటికే కాకుండా తాగునీటికీ కటకటలాడే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో 40 డిగ్రీలపైనే ఎండలు వీస్తాయని అంటున్నారు. ఇలాంటపుడు కృష్ణానదిలో ఉన్న నిల్వలు కూడా అడుగంటిపోతే రానున్న రోజుల్లో పెద్ద సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల):
కృష్ణానది.. పులిచింతల దిగువన జగ్గయ్యపేట మండలం ముక్త్యాల వద్ద ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాంతంలో కృష్ణానది ఎప్పుడూ నిండుకుండలా కనిపిస్తుంది. ముక్త్యాల, వేదాద్రి గ్రామాల దగ్గర కృష్ణానది వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. కానీ, నదిలో లోతు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ నీరు నిల్వ ఉండి నిండుకుండను తలపిస్తుంది. ఈ ప్రాంతంలో మాత్రం కృష్ణానదిలో ఏడాది పొడవునా నీళ్లు కనిపిస్తాయి. కానీ, దిగువన చందర్లపాడు మండలంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల, ఉస్తేపల్లి దగ్గర మాత్రమే నీరు కనిపిస్తుంది. అక్కడి నుంచి దిగువన మాత్రం నీరుండదు. ఈ ప్రాంతంలో నదీ ప్రవాహం పాయలుగా చీలుతుంది. ఈ పాయలోనే నీళ్లు కనిపిస్తాయి. ఈ పాయ నుంచి నదీ ప్రవాహం గుంటూరు జిల్లా వైపు వెళ్తుంది. దీనివల్ల చందర్లపాడు మండలం కాసరబాద, పొక్కునూరు, కొడవటికల్లు, పున్నవె ల్లి, వెలది కొత్తపాలెం, పోపూరు, విభరింతలపాడు, ఏటూరు, కంచికచర్ల మండలం మున్నలూరు, కునికినపాడు, చెవిటికల్లు, గనిఆత్కూరు, కొత్తపేట, ఇబ్రహీంపట్నం మండలం దాములూరు, కొటికలపూడి, మూలపాడు, కిలేశపురం, జూపూడి గ్రామాల వరకు నదిలో ఇసుక తప్ప నీరు కనిపించట్లేదు. ఎన్టీఆర్ జిల్లా వైపు నదిలో విచ్చలవిడిగా ఇసుక తీయడం వల్లే నదీ పాయల ప్రవాహం గతి తప్పింది. ప్రవాహం గతి తప్పటమే కాకుండా ఏకపాయగా మారింది. ఈ పాయ గుంటూరు వైపు మరలటంతో ఇటు వైపు పూర్తిగా నది నీరే లేకుండా కనిపిస్తోంది. గుంటూరు నుంచి వెళ్లే ఏకపాయ ద్వారానే కాస్తో, కూస్తో ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతోంది.