తెల్లపొణికి చెట్లు పెంచుదాం
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:08 AM
తెల్లపొణికి చెట్లు పెంచుదాం.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలోని సచివాలయం ఐదవ బ్లాక్లో మంగళవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కొండపల్లి బొమ్మల పరిశ్రమ ఎదిగేందుకు, దానికి అవసరమైన ముడిసరుకుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తెల్లపొణికి చెట్ల పెంపకంపై దృష్టి సారించాల్సిన అంశాలను కలెక్టర్ లక్ష్మీశ సీఎం చంద్రబాబు దృష్టికి ప్రత్యేకంగా తీసుకువచ్చారు.
- కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహిద్దాం
- తెల్లపొణికి కొరతపై సీఎం చంద్ర బాబు
- కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్ లక్ష్మీశ
- తెల్లపొణికి, అంకుడు చెట్ల పెంపకానికి ప్రత్యేక ప్రాజెక్టు తీసుకువస్తామని హామీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
తెల్లపొణికి చెట్లు పెంచుదాం.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలోని సచివాలయం ఐదవ బ్లాక్లో మంగళవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కొండపల్లి బొమ్మల పరిశ్రమ ఎదిగేందుకు, దానికి అవసరమైన ముడిసరుకుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తెల్లపొణికి చెట్ల పెంపకంపై దృష్టి సారించాల్సిన అంశాలను కలెక్టర్ లక్ష్మీశ సీఎం చంద్రబాబు దృష్టికి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తెల్లపొణికి చెట్లు అడవులలో అంతరించిపోతుండటంతో కళాకారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బొమ్మల తయారీపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం స్పందించారు. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు మన సంస్కృతిలో భాగమని, ఈ కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ప్రత్యేక ప్రాజెక్టుతో బొమ్మల తయారీకి అవసరమైన చెట్లను పెంచి, కలపను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రాజెక్టును రూపొందించాలని సూచించారు. తెల్లపొణికి చెట్లను పెంచటానికి వీలుగా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.