పదిలో నూరుశాతం ఫలితాలు సాధిద్దాం
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:40 AM
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు అందరం సమష్టిగా పనిచేసి పదవ తరగతిలో నూరుశాతం ఫలితాలను సాధిద్దామని డీఈవో యు.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు.
-నూతన డీఈవోగా సుబ్బారావు బాధ్యతల స్వీకరణ
- మర్యాదపూర్వకంగా కలెక్టర్తో భేటీ
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు అందరం సమష్టిగా పనిచేసి పదవ తరగతిలో నూరుశాతం ఫలితాలను సాధిద్దామని డీఈవో యు.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. అనుభవజ్ఞులు, కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారని తెలిపారు. ఇప్పటి నుంచే పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు పెట్టాలని చెప్పారు. మరీ వెనుకబడి ఉండే విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలన్నారు. జిల్లాకు విద్యారంగంలో మంచి పేరు ఉందని, ఆ పేరు నిలబెట్టేందుకు సమష్టి కృషితో పనిచేయాలన్నారు. కలెక్టర్ బాలాజీ సైతం పాఠశాలలను సందర్శిస్తున్నారని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగాలని కోరారు. టెట్ పరీక్షల గురించి సమీక్షించారు.
డీఈవోను కలిసి ప్రైవేటు పాఠశాలల సంఘం నేతలు
డీఈవో సుబ్బారావును ప్రైవేటు పాఠశాలల సంఘ రాష్ట్ర నాయకులు కొమరగిరి చంద్రశేఖరరావు, వి.సుందరరాం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగౌరీ ప్రసాద్, అజ్మతుల్లా ఖాన్, కోశాధికారి ఎస్.పూర్ణచంద్రాచార్యులు, బందరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కె.జాన్, కె.నాగమోహనరావు, కోశాధికారి కె.ప్రభాకర్ కలిసి ఘనంగా సత్కరించారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం నాయకులు గంగాధర్ తదితరులు కలిసి శుభాకాంక్షులు తెలియజేశారు. డీఈవో సుబ్బారావును ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, నాయకులు పి.ఇమ్మానుయేల్, యు.వి.కృష్ణమూర్తి, ప్రసాద్, చంద్రశేఖర్, కొమ్ము ప్రసాద్ తదితరులు కలిసి సన్మానించారు.