Public Event: కుప్పంలో నేడు కృష్ణాహారతి
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:26 AM
చిత్తూరు జిల్లా కుప్పంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని...
కృష్ణా జలాలకు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు
కుప్పం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కరువు భూతాన్ని తరిమేసేందుకు మొక్కవోని సంకల్పంతో శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా జలాలకు కుప్పంలోని హంద్రీ-నీవా ఉప కాలువ వద్ద శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికి జలహారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం ఆయన కుప్పం చేరుకున్నారు. రాత్రికి కడపల్లె సమీపంలోని స్వగృహంలో బస చేశారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 3.45 గంటలదాకా కుప్పం పురపాలక సంఘ పరిధిలోని పరమసముద్రం చెరువుతోపాటు సమీపంలోని హంద్రీ-నీవా ఉపకాలువ వద్ద జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కృష్ణా జలాలకు హారతి ఇవ్వడానికి ముందు కాలువ ఒడ్డున పైలాన్ ప్రారంభిస్తారు. సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటన కోసం అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. కుప్పం మండలం పరమసముద్రం చెరువుతోపాటు సమీపంలోని కాలువ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజనీర్లు శుక్రవారం సమీక్షించారు.