Share News

సరిహద్దుల్లో ‘కిక్‌’

ABN , Publish Date - Jun 16 , 2025 | 01:01 AM

బిక్కి నరేంద్ర... కానూరు కేంద్రంగా మణికంఠ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. కొంతమందిని అందులో పనిచేసే సిబ్బందిగా చూపించి ఒడిసా సరిహద్దుల నుంచి గంజాయిని రప్పించేవాడు. కార్యాలయం పై అంతస్తులో గంజాయిని నిల్వ ఉంచి బెంగళూరుకు సరఫరా చేస్తున్నాడు. అతడితోపాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు పెనమలూరు మండలం పోరంకి, యనమలకుదురు గ్రామానికి చెందిన వారే. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది. -పెనమలూరు మండలం సనతనగర్‌కు చెందిన తిరుమలశెట్టి జీవన్‌కుమార్‌ అలియాస్‌ కిన్ను బీటెక్‌ చదువుకుని ఖాళీ ఉంటున్నాడు. స్నేహితుడు మనోహర్‌ ద్వారా ఢిల్లీ నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను హైదరాబాద్‌కు పార్సిల్‌ సర్వీసు తెప్పించుకుని అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చేవాడు. ఇలా కొద్దిరోజుల క్రితం ఎండీఎంఏ తీసుకొస్తుండగా జీవన్‌తోపాటు మరో ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారిలో బొంతు నితీష్‌కుమార్‌ అనే యువకుడు విజయవాడ ఫన్‌టైం క్లబ్‌ వీధికి చెందిన వాడు. మరో నిందితుడు తరుణ్‌ప్రసాద్‌ యనమలకుదురు గ్రామానికి చెందిన వాడు. కొద్దిరోజుల క్రితం పటమట పోలీసులు నమోదు చేసిన కేసు ఇది.

సరిహద్దుల్లో ‘కిక్‌’

పెనమలూరు కేంద్రంగా గ్యాంగ్‌లు

జిల్లా సరిహద్దుల్లో ఉంటూ వ్యవహారాలు

వరుసగా సీటీఎఫ్‌కు చిక్కుతున్న నిందితులు

గంజాయి కేసుల్లో ఇద్దరు, ముగ్గురు ఆ మండలం వారే

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

-బిక్కి నరేంద్ర... కానూరు కేంద్రంగా మణికంఠ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. కొంతమందిని అందులో పనిచేసే సిబ్బందిగా చూపించి ఒడిసా సరిహద్దుల నుంచి గంజాయిని రప్పించేవాడు. కార్యాలయం పై అంతస్తులో గంజాయిని నిల్వ ఉంచి బెంగళూరుకు సరఫరా చేస్తున్నాడు. అతడితోపాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు పెనమలూరు మండలం పోరంకి, యనమలకుదురు గ్రామానికి చెందిన వారే. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటన ఇది.

-పెనమలూరు మండలం సనతనగర్‌కు చెందిన తిరుమలశెట్టి జీవన్‌కుమార్‌ అలియాస్‌ కిన్ను బీటెక్‌ చదువుకుని ఖాళీ ఉంటున్నాడు. స్నేహితుడు మనోహర్‌ ద్వారా ఢిల్లీ నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ను హైదరాబాద్‌కు పార్సిల్‌ సర్వీసు తెప్పించుకుని అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చేవాడు. ఇలా కొద్దిరోజుల క్రితం ఎండీఎంఏ తీసుకొస్తుండగా జీవన్‌తోపాటు మరో ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారిలో బొంతు నితీష్‌కుమార్‌ అనే యువకుడు విజయవాడ ఫన్‌టైం క్లబ్‌ వీధికి చెందిన వాడు. మరో నిందితుడు తరుణ్‌ప్రసాద్‌ యనమలకుదురు గ్రామానికి చెందిన వాడు. కొద్దిరోజుల క్రితం పటమట పోలీసులు నమోదు చేసిన కేసు ఇది.

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ సరిహద్దుల్లో మత్తు గ్యాంగ్‌లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు భాగంలో ఈ గ్యాంగ్‌ల సంచారం, కొత్త గ్యాంగ్‌ల ఏర్పాటు ఎక్కువగా ఉంది. వాస్తవానికి కమిషనరేట్‌కు పశ్చిమ వైపున తెలంగాణ సరిహద్దుగా ఉంది. ఉత్తరం వైపున గుంటూరు జిల్లా సరిహద్దుగా ఉంది. ఈ రెండింటితో లేని బెంగ ఎక్కువగా తూర్పు వైపు సరిహద్దుతో ఉంటోంది. కమిషనరేట్‌కు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సరిహద్దుగా ఉంది. పటమట పోలీసు స్టేషన్‌ సరిహద్దులను ఆనుకుని ఈ సరిహద్దులు ఉన్నాయి. ఇది కాకుండా గూడవల్లి వైపున గన్నవరం పోలీసు స్టేషన్‌ పరిధి సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఈ సరిహద్దులు భౌగోళికంగానే కాకుండా శాఖల పరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేట్‌కు ఈ సరిహద్దు ఒక తలనొప్పిగా మారిపోయింది. గంజాయి కేసుల్లో చిక్కుతున్న నిందితుల్లో ఎక్కువ మంది పెనమలూరు మండలానికి చెందిన వారే ఉంటున్నారు.

కూటమి ప్రభుత్వం రాకతో ప్రత్యేక బృందం ఏర్పాటు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి పక్కా ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం ఈగల్‌ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పోలీసు కమిషనరేట్‌ అధికారులు గంజాయితో సంబంధం ఉన్న వారి లెక్కలను పక్కాగా సేకరించారు. స్మోకర్లు చిక్కినప్పుడల్లా ఒక్కో కింగ్‌ పేరు వెలుగులోకి వస్తోంది. యువతకు గంజాయి ఒడిసా సరిహద్దుల నుంచి వస్తుందని నిర్థారించారు. అక్కడి నుంచి గంజాయిని తీసుకొస్తున్న గ్యాంగ్‌లు పెనమలూరు మండలంలో తేలుతున్నాయి.

ఏడాదిలో 100 మంది అరెస్టు

ఏడాది కాలంలో గంజాయిలో కేసుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారుగా 100 మంది నిందితులను అరెస్టు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారిలో 30 మంది వరకు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన వారే కావడం గమనార్హం. విజయవాడ నగరంలోకి గంజాయి పెనమలూరు పరిధి నుంచే వస్తుందని పోలీసు కమిషనరేట్‌ అధికారులు ఒక నిర్థారణకు వచ్చారు. కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని విజయవాడ పరిధిలో వ్యవహారాలు సాగిస్తున్నారు. ఈ కేసుల్లో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేస్తే వారిలో ఇద్దరు, ముగ్గురు ఆ ప్రాంతానికి చెందిన వారే ఉంటున్నారు. దీనిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో కొరవడిని నిఘా

పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ ఒకప్పుడు పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉండేది. గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను లోక్‌సభ స్థానాల పరిధిని బట్టి ఏర్పాటు చేసింది. దీంతో పెనమలూరు కృష్ణాజిల్లా పరిధిలోకి వెళ్లిపోయింది. ఎన్టీఆర్‌ జిల్లాకు సరిహద్దులుగా ఉన్న ప్రాంతాలను పెనమలూరు పోలీసులు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవన్న విమర్శ ఆ ప్రాంతాల్లో వినిపిస్తోంది. కానూరు, యనమలకుదురు వాస్తవానికి పెనమలూరు మండలంలో ఉన్నప్పటికీ విజయవాడలో భాగంగానే కనిపిస్తాయి. దీనితో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. పైకి రకరకాల వ్యాపారాలు చేస్తున్నట్టు కనిపించి అంతర్గతంగా గంజాయిపై ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ గంజాయి సరఫరాకు నగరంలో ఉన్న స్మోకర్లను ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. కిక్‌కు కేంద్రంగా మారిన ఈ సరిహద్దు ప్రాంతాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో అధికారులు ఉన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 01:01 AM