Gudluru Incident: కులాలకు ఆపాదించడం సిగ్గుచేటు
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:12 AM
ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన విభేదాలు, ఆపై జరిగిన దుర్ఘటనకు కులాలకు ఆపాదించాలని కొందరు ప్రయత్నం చేయడం సిగ్గు చేటని కందుకూరు నియోజకవర్గ....
గుడ్లూరు ఘటనపై కందుకూరు నియోజకవర్గ కాపు నేతలు
కందుకూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన విభేదాలు, ఆపై జరిగిన దుర్ఘటనకు కులాలకు ఆపాదించాలని కొందరు ప్రయత్నం చేయడం సిగ్గు చేటని కందుకూరు నియోజకవర్గ కాపునేతలు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడు ఘటన నేపథ్యంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఘటన బాధాకరమని, బాధిత కుటుంబానికి మద్దతు తెలియజేస్తున్నారని చెప్పారు. చనిపోయిన తిరుమణిశెట్టి లక్ష్మయ్యనాయుడు కూడా టీడీపీ కార్యకర్త అని పేర్కొంటూ అతడి సభ్యత్వ కార్డును వారు చూపించారు. అయితే దుర్ఘటన పేరు చెప్పి కొంతమంది రెండు కులాల మధ్య, రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు కుఠిలయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత, ఆర్థిక అంశాలు ఉన్నాయని, దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేశారని వెల్లడించారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కూడా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని కాపునేతలు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యేపై కొందరు ఆరోపణలు చేస్తూ ఒక కులానికి ఈ దుర్ఘటనను ఆపాదించాలని చూస్తుండటాన్ని నియోజకవర్గ కాపు నేతలుగా సహించబోమన్నారు.